తెలంగాణ పార్టీ పెట్టమంటున్నారు: దామోదర్
విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని ఆయన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని కోరారు. తాను రాజీనామా చేసినప్పుడు చర్చలకు రావాలని పార్టీ అధిష్టానం నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని, దీంతో ముత్యంరెడ్డి, మహేశ్వర రెడ్డిలతో కలిసి ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి చెందిన నాయకులందరితో చర్చలు జరిపానని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ వల్ల తెలంగాణకు న్యాయం జరుగుతుందని తనకు ఆ చర్చల వల్ల అర్థమైందని, వారు తనకు ఆ నమ్మకం కలిగించారని ఆయన అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 24 గంటల పాటు శాంతి నెలకొంటే కేసులు ఎత్తేస్తామని చిదంబరం హామీ ఇచ్చారని, అటువంటి శాంతి నెలకొని ఉందని, పరిస్థితి ప్రశాంతంగా ఉందని గవర్నర్ కూడా నివేదిక ఇచ్చారని, అందువల్ల విద్యార్థులపై కేసులు ఎత్తేయాల్సిన అవసరం ఉందని, కేసు ఎత్తివేతకు మరోసారి చిదంబరాన్ని కోరుతానని ఆయన చెప్పారు. శాసనసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ చేయాలనుకోవడం సరి కాదని ఆయన అన్నారు. తెరాస అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ విషయమై తాను పార్టీ నాయకత్వంతో మాట్లాడుతానని ఆయన చెప్పారు.