పార్టీలు ఎన్ని అభిప్రాయాలైనా చెప్పొచ్చు: శ్రీకృష్ణ
ఇది కేవలం ప్రాథమిక సమావేశం మాత్రమేనని, ప్రజలతో ముఖాముఖి మాట్లాడేందుకు క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులున్నాయో తెలుసుకోవాలని వచ్చామని, తాము మంచి పని చేస్తున్నామని, ప్రజలందరూ వచ్చి మాతో కలుస్తారని ఆయన అన్నారు. రాజకీయ పార్టీల నుంచే కాకుండా సాధారణ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇబ్బంది లేదని అన్నారు. ప్రజలు తమను వ్యతిరేకించినా, సమర్థించినా అభ్యంతరం లేదని అన్నారు. రాజకీయ పార్టీలకు ఎన్ని అభిప్రాయాలైనా ఉండొచ్చునని, కొంతమంది కమిటీని వ్యతిరేకిస్తున్నారని, ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తనకు తెలియాలని, ప్రాంతాల వారీగా రాజకీయ, ఆర్థిక, సామాజిక, న్యాయ, సాంస్కృతిక అంశాలను కూలంకషంగా పరిశీలిస్తామని అన్నారు. తమ నిర్ణయం ఏదైనా మా నివేదిక చరిత్రాత్మకమైనదిగా ఉంటుందని, వాస్తవికతకు దర్పణం పడుతుందని చెప్పారు. రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఏ అభిప్రాయాలు వ్యక్తం చేసినా స్వీకరిస్తామని అన్నారు.
తమ కమిటీ కార్యాలయానికి వచ్చే ప్రతి పేపర్ పట్ల సీరియస్ గా వ్యవహరిస్తామని, ప్రతి దానికీ గౌరవమిస్తామని కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ చెప్పారు. సమాచారం చాలా రకాలుగా వస్తున్నదని, రోజుకు కనీసం 50కిపైగా వినతులు అందుతున్నాయని, అయితే ఒకే దానిపై ఆధారపడబోమని, రెండో వనరు కూడా ఉండాలని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలకు ఒక అభిప్రాయం ఉంటుందని, ప్రజలకు రకరకాల అభిప్రాయాలుంటాయని, 1952 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్ర అంతా తమ దగ్గరుందని 1969లో ఏం జరిగిందో కూడా సమాచారం ఉందని, సమాంతరంగా సీనియర్ కన్సల్టెంట్తో పని చేస్తున్నామని ఓ చారిత్రక నివేదిక ఇవ్వాలంటే సమయం కావాలని వివరించారు.