సముద్రంలో చేపల వేట నిషేధం
ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే ఒక్కో బోటుకు రూ.2,500 జరిమానా విధించనున్నట్లు చెప్పారు. అవసరమైతే బోటు లైసెన్సును కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మత్స్య సహకార సంఘంలో సభ్యుడిగా ఉండి నెలకు రూ.75ల చొప్పున పొదుపు చేసిన ఒక్కో మత్య్సకారుడికి పొదుపు సొమ్ముతో కలిపి రూ.1800ల వరకూమంజూరు చేస్తామని చెప్పారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి నెలకు 20 కిలోల బియ్యం ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు.
జిల్లాలో చేపల వేటకు 950 బోట్లను వినియోగిస్తున్నారు. వీటిపై ప్రత్యక్షంగా ఆధారపడి ఆరువేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మెకనైజ్డ్ బోట్లు ద్వారా చేపలవేట కొనసాగించేవారు వారం, పదిరోజులపాటు సముద్రంలోనే గడుపుతారు. బోట్ల ద్వారా వచ్చిన సరుకును మార్కెటింగ్ చేయడం, చిన్న వ్యాపారులు, ఐస్ బ్లాక్ల తయారీ, ప్యాకింగ్ తదితర పనులను చేస్తూ మరో 7వేల మందికిపైగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.