రామోజీ గ్రామంలో రాజకీయ రగడ
గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు విరాళాలు సేకరించి దివంగత ముఖ్యమంత్రి వైయస్ విగ్రహాన్ని గ్రామం ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేశారు. విగ్రహ ప్రారంభోత్సవానికి జెడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు, పామర్రు ఎమ్యెల్యే డీవై దాస్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు, స్థానిక కాంగ్రెస్ నాయకులు కొడాలి జగన్మోహనరావులను ఆహ్వానించారు. విగ్రహావిష్కరణ ఉదయం 9గంటలకు జరగాల్సి ఉండగా మధ్యాహ్నం 12గంటల దాటినా నాయకులు రాలేదు. ఒక పథకం ప్రకారమే నేతలు హాజరుకావడం లేదని తెలుసుకున్న గ్రామస్తులు ఆవేశంతో రగిలిపోయారు.
వైయస్ పేరు చెప్పుకొని గెలిచిన నాయకులు ఆయన విగ్రహావిష్కరణకు రాకపోవటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్యెల్యే దాస్, కేఎన్ఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఆగ్రహాన్ని అంతటితో ఆపకుండా ఎమ్మెల్యే డీవై దాస్, కేఎన్ఆర్ పేర్లు ఉన్న శిలాఫలకాన్ని పలుగులు, గుణపాలతో ధ్వంసం చేసి బురద పూశారు. అనంతరం స్థానిక వార్డు సభ్యులు, డ్వాక్రా మహిళలు, ప్రజలు కలసి తమ ప్రియతమ నేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైస్ రాజశేఖరరెడ్డి బొమ్మ పెట్టుకుని గెలిచిన నాయకులు నేడు ఈవిధంగా వ్యవహరించడాన్ని ప్రజలు హర్షించరని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విగ్రహ కమిటీ నిర్వాహకులు అబ్రహం, కాంగ్రెస్ కార్యకర్తలు బొల్లవరపు నాగేశ్వరరావు, శరాబంది, ఆదినారాయణ, డ్వాక్రామహిళ బడి భవాని పాల్గొన్నారు.