చిరంజీవి వస్తే, చూసుకోండి: కెసిఅర్

సిరిసిల్లకు చెందిన తెదేపా నేత, జడ్పీ మాజీ వైస్ఛైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ఆరేటి రమేశ్, సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ గాజుల బాలయ్య, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు తదితరులు మంగళవారమిక్కడ తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. తాను 11 రోజులపాటు ఆమరణ దీక్ష చేసి తెలంగాణపై ప్రకటన చేయిస్తే ఇక్కడి కురచ మనస్తత్వం ఉన్న నేతలు కనీసం పదవులకు త్యాగం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్, తెలుగుదేశ ఓట్ల కోసమే తెలంగాణ అంటున్నాయని, తెరాస మాత్రమే నికార్సయిన తెలంగాణవాద పార్టీ అని తెలంగాణ ప్రజలు తెరాస ఉండాలని కోరుకుంటున్నారని, పార్టీ కాంగ్రెస్లో విలీనమయ్యే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణ, ఆంధ్రల్లో పార్టీ ఉంటుందని భావిస్తున్నాడని, కానీ తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడి ప్రజలు ఆంధ్ర పెత్తనం ఉన్న పార్టీని కోరుకోరని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని చూసిన ఒక నాయకుడు వెల్లకిలపడ్డాడని, ఇప్పటివరకు లేవలేకపోతున్నాడని చంద్రబాబునుద్దేశించి పరోక్షంగా అన్నారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన దళితుడే ప్రత్యేక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. తెలంగాణకు ఇప్పటికీ అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
తెలంగాణవాదుల పోరాటం విజయవంతమవుతుందన్నారు. పదేళ్లుగా తాను ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటూ కరకుగా, మొండిగా నిలబడ్డానన్నారు. తెలంగాణ ప్రజలకు అన్యాయంపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అంతా వివరంగా చెబుతున్నామని తెరాస అధ్యక్షుడు తెలిపారు. "శాసనసభలో, పార్లమెంటులో, సమావేశాల్లో అందరికీ తెలంగాణకావాలని చెప్పాం. ఎవ్వరూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీర్చకపోతే అంతర్యుద్ధం రాక ఏం వస్తుంది" అని అడిగారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే అంతర్యుద్ధం ఉందని, నక్సలైట్లకు, పోలీసులకు మధ్య జరుగుతున్నది ఏమిటని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాను చెబితే తెరాస గుర్తింపు రద్దు చేయాలంటున్నారని తప్పుబట్టారు.












Click it and Unblock the Notifications