దంతెవాడ నరమేధం: 44 మంది మృతి
ఈ ఏడాదిలో దేశంలో జరిగిన అతిపెద్ద అయిదు నక్సల్స్ దాడుల్లో ఇది ఒకటి. దంతెవాడ జిల్లా కిరండోల్ అటవీ ప్రాంతంలో జిల్లా సాయుధ బలగాలు, ఎస్పీవోలు(పోలీసులకు సహాయంగా ఉండే గిరిజనులు) కలిసి మూడు రోజులుగా గాలింపులు నిర్వహించారు. బృందం సోమవారం మధ్యాహ్నానికి కాలినడకన సింగవరం చేరుకుంది. అదే సమయంలో దంతెవాడ నుంచి సుకుమా వెళ్తున్న ప్రవేటు బస్సు అక్కడికి వచ్చింది. పైకప్పుపై 20 మంది ఎస్పీవోలు ఎక్కారు. దాని వెనకనే పాల్వంచ వెళుతున్న ఐరన్ఓర్ లారీల్లో ఒక్కోదాన్లో 50 చొప్పున మొత్తం వంద మంది ఎక్కారు. సింగవరంలో బస్సు కదిలిన పది నిమిషాల్లోపే పేలుడు సంభవించింది. క్షతగాత్రులను సుకుమా(భద్రాచలం జగదల్పూర్ ప్రధాన రహదారిపై ఉంటుంది) ఆసుపత్రిలో చేర్చారు. పేలుడు జరగ్గానే లారీల్లో వెళుతున్న ఎస్పీవోలు పరారయ్యారు. ఘటనాస్థలం గాధీరాజ్ పోలీసు స్టేషన్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మందుపాతర సంఘటన స్థలంలో వాతావరణం అత్యంత భయానకంగా ఉంది. మానవ దేహాలు మాంస ఖండాలుగా తెగిపడి ఉన్నాయి. కొన్ని శరీర భాగాలు పక్కనున్న చెట్లకు చుట్టుకు పోయాయి. పేలుడుతో ముక్కలై మెలికలు తిరిగిన బస్సు శకలాల నుంచి రక్తం చుక్కలుచుక్కలుగా కారుతోంది. దిక్కులేని అనాధల్లా ప్రయాణికుల మృతదేహాలు రోడ్డు మీద పడి ఉన్నాయి. బస్సు ముందుభాగం దగ్గరే పేలుడు సంభవించడంతో అది తునాతునకలై ఇనుప ముద్దగా మారింది. పలుదేహాలు సీట్లలో ఇరుక్కుపోవడంతో సీట్లను కట్టర్లతో కోసి బయటికి తీయాల్సి వచ్చింది. పలువురి మొహాలు గుర్తుపట్టే విధంగా లేవు. సంఘటన స్థలంలో ప్రయాణికుల సామగ్రి, చెప్పులు, పోలీసుల ఆయుధాలు చెల్లాచెదరై పడిఉన్నాయి.