వైయస్ జగన్ కు రోశయ్య కౌంటర్
వైయస్ పథకాలనే ప్రశ్నించే పరిస్థితిని రోశయ్య కల్పించారు. కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెసు నాయకులు వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై విమర్శలకు దిగారు. వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను సమీక్షించాలని జెసి దివాకర్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయంతో వివాదం ముదిరింది. వైయస్ పథకాలన్నీ బోగస్ అని మరో సీనియర్ శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. రవీంద్రా రెడ్డి ఒకప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. సంక్షేమ పథకాల అమలుపై అధ్యయానికి వేసిన మంత్రివర్గ ఉప సంఘంలో వైయస్ జగన్ ను వేయాలని మరో కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకర రావు సూచించారు. కెవిపి రామచందర్ రావుకు కూడా ఆ కమిటీలో స్థానం కల్పించాలని ఆయన అన్నారు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సంక్షేమ పథకాలను యధాతథంగా అమలు చేయడం సాధ్యం కాదనే విషయాన్ని జగన్ గ్రహించాలనే విషయాన్ని శంకర రావు పరోక్షంగా చెబుతున్నారని భావించాల్సి ఉంటుంది.
కొత్త పనులు వేయాల్సిన పరిస్థితి లేదని, అందువల్ల సంక్షేమ పథకాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని జెసి దివాకర్ రెడ్డి శుక్రవారం మరోసారి అన్నారు. మరింత మంది శాసనసభ్యులు కూడా జెసి వ్యాఖ్యలకు మద్దతుగా ముందుకు వస్తున్నారు. వైయస్ జగన్ కు కౌంటర్ గానే వీరంతా రంగంలోకి దిగినట్లు భావిస్తున్నారు.