బిజెపి నేత కిషన్ రెడ్డి అరెస్టు, దీక్ష భగ్నం
కిషన్ రెడ్డి దీక్ష ప్రారంభించడానికి ముందే పోలీసులు బిజెపి నేతలతో చర్చలు జరిపారు. దీక్షకు అనుమతి లేదని, విరమించుకోవాలని కోరారు. కానీ వారు అందుకు అంగీకరించలేదు. మధ్యాహ్నం 12:30 గంటలకు కిషన్ రెడ్డి దీక్షలో కూర్చున్నారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కార్యకర్తలు వేదిక ముందు బైఠాయించి వారిని ప్రతిఘటించారు. తమ నాయకుడిని అరెస్టు చేస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. తర్వాత నేతల ప్రసంగాలకు లౌడ్స్పీకర్లకు అనుమతి లేదంటూ మైకులు కట్ చేయడంతో భాజపా నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, కాసం వెంకటేశ్వర్లు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా తమ నాయకుడు దీక్ష చేపడితే అడ్డుకోవడం తగదని ధ్వజమెత్తడంతో ముఖ్యనేతల ప్రసంగాల వరకు మైక్కు అనుమతిచ్చారు. చివరకు సోమవారం రాత్రి కిషన్ రెడ్డిని అరెస్టు చేసి, దీక్ష భగ్నం చేశారు.