ఓదార్పు యాత్ర పేరుకే: వైయస్ జగన్ వ్యూహాత్మక రాజకీయం?
ఆ పత్రిక వార్తాకథనం ఈ విధంగా సాగింది - ప్రతి జిల్లాలో సాధ్యమయినన్ని ఎక్కువ రోజులు యాత్ర జరిగేలా వ్యూహరచన సాగుతోంది. రాజశేఖరరెడ్డి మరణించాక నల్లకాలువ వద్ద తాను ఇచ్చినమాట మేరకే ఓదార్పు చేస్తున్నానని జగన్ పదేపదే చెబుతున్నారు. యాత్ర మొదలుపెట్టడానికే ఆయనకు కొన్ని నెలలు పట్టింది. తొలుత పశ్చిమగోదావరి జిల్లాతో మొదలు పెట్టి ఖమ్మం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో పూర్తి చేశారు. ఇప్పుడు ప్రకాశంలో సాగుతోంది. మొదట్లో అనుకున్న షెడ్యూలుకు కొంత అటు ఇటుగా యాత్ర జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి సీను మారిపోయింది. యాత్రకు శాసనసభ్యులు వెళ్ళరాదని అధిష్ఠానం ఆంక్షలు విధించసాగింది. అప్పుడే పార్టీలో తన పరిస్థితిని అర్థం చేసుకున్న జగన్, సొంత అజెండా ప్రకారమే ముందుకు వెళ్ళాలనే స్థిర నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకే తూర్పు గోదావరి జిల్లా యాత్ర పొడిగింపు జరిగింది.
తొలుత ఆ జిల్లాలో వారం రోజుల పాటు యాత్ర నిర్వహించాలని నిర్ణయించినా చివరికి 18 రోజుల పాటు సాగించారు. ఆ తరువాతి నుంచి ఓదార్పు అదే రీతిలో సాగుతోంది. ముందు అనుకున్న షెడ్యూలు కంటే దాదాపు రెట్టింపు సమయం జిల్లాలో పర్యటిస్తున్నారు. మార్గమధ్యంలో గ్రామాల ప్రజల ఒత్తిడిమేరకే వెళ్తున్నామని చెప్పుకుంటున్నా ఇదంతా ముందస్తు ఎత్తుగడ మేరకే జరుగుతోందని భావిస్తున్నారు. ప్రతి చోటా జగన్ శిబిరం ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలపై ప్రధానంగా దృష్టిపెడుతోంది. వారిని ఆకట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. యాత్ర పూర్తయ్యాక కూడా ఆయా గ్రామాలకు చెందిన ముఖ్య నేతలతో సంబంధాలు కొనసాగించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో కొందరికి బాధ్యతలు అప్పగిస్తున్నారు.