డిసెంబర్ తర్వాత కెసిఆర్ అనుసరించే వ్యూహం ఏమిటి?
డిసెంబర్ తర్వాత భూకంపం పుట్టిస్తామని కెసిఆర్ పదే పదే చెబుతున్నారు. తెలంగాణ ఇవ్వకపోతే మానవ బాంబులుగా మారుతామని ఇటీవల కెసిఆర్ అన్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్త వచ్చింది. దానిపై కేసిఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తాను అలా అనలేదని ఆయన చెప్పారు. అయితే, డిసెంబర్ తర్వాత చేపట్టే ఆందోళన శాంతియుతంగానే ఉండాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు ఇటీవల అమెరికాలోని తెలంగాణ ఎన్నారైల సమావేశంలో చెప్పారు. శాంతియుతంగా ఉద్యమం చేపట్టినా అది ప్రభుత్వాన్ని స్తంభింపజేసేలా ఉండాలనేది కెసిఆర్ ఆలోచన. అందుకు పెద్ద యెత్తున సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టడమే మేలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే తాను మళ్లీ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. అయితే, పార్టీ నాయకులు అందుకు అంగీకరించే అవకాశం లేదు. సహాయ నిరాకరణకే తెలంగాణలోని అన్ని సెక్షన్లను సిద్ధం చేయాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు.