షరతులు అంగీకరిస్తే ప్రభుత్వంతో చర్చలకు గణపతి రెడీ
పార్టీ కేడర్ కు రాజకీయ శిక్షణ ఇవ్వడానికి వెళుతున్న ఆజాద్ ను పోలీసులు హతమార్చారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అది ఎన్ కౌంటర్ కాదని, బూటకపు ఎన్ కౌంటరని చెప్పాడు. ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రీన్ హంట్ ఆపితే, జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేస్తే తాము చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే గ్రీన్ హంట్ ని ఆపి మమ్మల్ని చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. శాంతిపై, ప్రజల సమస్యలపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. శాంతి, చర్చలు వర్గపోరాటంలో భాగమేనని అన్నారు.
అడవుల్లో ఉన్న మా నాయకులను చర్చలకు పంపడానికి కుదరదని, జైళ్లలో ఉన్న మా నాయకులతో సంప్రదింపులు జరపవచ్చునని పేర్కొన్నారు. పీఠాలు కదిలి పోతున్నాయనే ప్రభుత్వం సైన్నాన్ని రంగంలోకి దింపుతుందని, ప్రజా పోరాటాన్ని అణిచివేయడానికి సైన్నాన్ని రంగంలోకి దింపడం హేయమన్నారు. ఈ దుష్టపన్నాగంలో కాంగ్రెసుతోపాటు భాజపాకు పాత్ర ఉందని దుయ్యబట్టారు. మహా విధ్వంసం - పాలకవర్గాల విధానానికి ప్రజలకు పిలుపునిస్తున్నామని అన్నారు. మేమిచ్చే పిలుపు ఐఎంఎఫ్ వంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. దంతెవాడ బస్సు ప్రమాదం తమ తప్పిదమేనని, అయితే అందుకు క్షమాపణ చెబుతున్నామన్నారు. అయితే జ్ఞానేశ్వరి ఘటనతో తమకు సంబంధం లేదన్నారు.
మీడియాలో మావోయిస్టులపై తప్పుడు కథనాలు ప్రసారం అవుతున్నాయని వాటిని తాను ఖండిస్తున్నట్టు చెప్పారు. మావోయిస్టుల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని ఆయన చెప్పారు. ఆజాద్ ఎన్ కౌంటర్ తో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయిందని, ఆజాద్, హేమచంద్రలను పోలీసులు అదిలాబాద్ లో బూటకంగా హతమార్చినట్టు సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఆజాద్ అందరికీ ఓ రోల్ మోడల్ అన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తాము నిలబడుతున్నామని, ఆజాద్ లోటును కూడా భర్తీ చేసుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ దాడులు నిలిచిపోతేనే ప్రజా ప్రతిఘటనలు ఆగిపోతాయని ఆయన చెప్పారు. కోరహట్ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు.