భవిష్యత్తు కార్యాచరమపై అనుచరులతో వైయస్ జగన్ మంతనాలు
రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమాయత్తమవుతున్నట్లు తెలియడం వల్లనే వైయస్ జగన్ తొందరపడినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ పూర్తి స్థాయిలో సమాయత్తం కాక ముందే రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే వైయస్ జగన్ అధిష్టానంతో సాధ్యమైనంత త్వరగా తెగదెంపులు చేసుకోవడంలో భాగంగానే సోనియాపై దాడికి దిగినట్లు చెబుతున్నారు.
కాగా, వైయస్ జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరని సోమవారంనాడు సాక్షి దినపత్రిక వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి. సోనియాపై రాసిన వార్తాకథనాన్ని సమర్థించుకుంటూ మరో వార్తాకథనాన్ని సాక్షి ప్రచురించింది. వైయస్ జగన్ కు సాక్షిలో వచ్చిన వార్తాకథనానికి సంబంధం లేదని చెప్పడానికి ప్రయత్నం చేసింది. అయితే, దాన్ని ఎవరూ విశ్వసించడం లేదు. అలాగే, వైయస్ జగన్ కు వ్యతిరేకంగా సాక్షి వార్తాకథనాన్ని ఆసరాగా చేసుకుని కుట్ర చేస్తున్నారని మరో వార్తాకథనాన్ని కూడా ప్రచురించింది. సూత్రధారులెవరంటూ సాక్షి ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది. ప్రధానంగా ముఖ్యమంత్రి రోశయ్యను, సీనియర్ నాయకుడు వి. హనుమంతరావును దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది.