గోల్కొండ కోటలో ఘనంగా ఆషాఢమాస బోనాల జాతర.. మహంకాళి అమ్మవారికి బంగారు బోనం!
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఆషాడ మాసం సందర్భంగా ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీలో భాగంగా కుమ్మర్లు జగదాంబ మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కూడిన తొలిబోనాన్ని సమర్పించారు. రాష్ట్రప్రభుత్వం తరఫున లంగర్హౌస్ నుండి బంగారు బోనం అత్యంత భక్తి శ్రద్దలతో సమర్పించారు. డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది.
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలలో వారు పాల్గొన్నారు . వారు ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. నేడు గోల్కొండ కోట పరిసరాలన్నీ భక్తుల రద్దీతో శోభాయమానంగా మారాయి. కోట వైపు వచ్చే దారులు అన్నీ భక్త జన సందోహంతో కిటకిటలాడాయి.

బోనాల పండుగకు భద్రత కట్టుదిట్టం
భక్తుల రద్దీ దృష్ట్యా చైన్ స్నాచింగ్స్, పిక్పాకెటింగ్ నివారణకు హైదరాబాద్ పోలీసులు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల ఫొటోలతో కూడిన ప్రత్యేక బ్యానర్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆషాడ మాసం బోనాలు నేటినుంచి ప్రారంభమైన సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణా ఆత్మను చాటే మహోత్సవం అన్న గవర్నర్
బోనాలు తెలంగాణ ఆత్మను చాటే మహోత్సవమని, ఇది కేవలం పండుగ మాత్రమే కాదని, ప్రజల విశ్వాసానికి ప్రతీక అని గవర్నర్ పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. జంట నగరాల్లో జరిగే ఈ వేడుకలు రాష్ట్ర గంగా-జమున తహజీబ్కు, లౌకిక స్ఫూర్తికి నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు.
3 వేలకు పైగా ఆలయాలలో ప్రభుత్వం ఘనంగా బోనాల పండుగ ఏర్పాట్లు
భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 3 వేలకు పైగా ఆలయాలలో ప్రభుత్వం ఘనంగా బోనాల జాతరకు ఏర్పాట్లు చేసిందని, ఇందుకోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.












Click it and Unblock the Notifications