కెఆర్ సురేష్ రెడ్డికి మంత్రి పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డి పట్టు
సలహాదారులందరి రాజీనామాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ ను ఆదేశించడంతో ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40 మందికిపైగా సలహాదారులు కొనసాగుతున్నారు. ఇందులో 10 మంది ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక తన సన్నిహితులైన నేతలు, విశ్రాంత అధికారులకు పునరావాసం కల్పించేందుకు వారిని సలహాదారులుగా నియమించారు. సోమయాజులు (వ్యవసాయం), సీసీరెడ్డి (విదేశీ పెట్టుబడులు), సీఎస్ రావు(ఐటీ), పీటర్ హాసన్ (పరిశ్రమలు), స్టాన్లీ బాబు(పురపాలక శాఖ) తదితరులు ఇందులో ఉన్నారు. వీరుగాక ఆర్థిక శాఖ, నీటిపారుదల తదితర శాఖలకు ప్రత్యేకంగా సలహాదారుల నియామకం జరిగింది. ప్రతీశాఖలోనూ ఆర్థిక సలహాదారులను నియమించుకున్నారు. ముస్లిం రిజర్వేషన్ల అమలుకోసం బీసీ సంక్షేమ శాఖలోనూ ఒక సలహాదారుని నియమించారు.
సలహాదారుల సంస్కృతి ఏ స్థాయికి చేరిందంటే రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ)లో ఏకంగా 25 మందిని సలహాదారుల పేరిట నియమించారు. ఆ సంస్థలో కేవీపీ సమీప బంధువైన పార్థసారధిరావును మూడేళ్ల పాటు సలహాదారుగా కీలకమైన బాధ్యతల్లో కొనసాగించారు. వైఎస్ అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టిన రోశయ్య హయాంలోనూ సలహాదారుల నియామకాలు కొనసాగాయి. ముఖ్యులందరికీ పదవీకాలం పొడిగించారు. చివరికి రోశయ్య సైతం పీకే అగర్వాల్ అనే విశ్రాంత ఐఏఎస్ను సలహాదారుగా నియమించుకున్నారు.