ప్రజా సమస్యలపై మొదటి సారి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి
తండ్రి ఇమేజ్ తోనే ముఖ్యమంత్రిగా కూర్చుందామని కలలు గన్నాడు. కాని అది నెరవేరలేదు. తాను పార్టీ పెట్టిన తర్వాత తండ్రి ఇమేజ్ ఒక్కటే సరిపోదు. జగన్ ప్రజా సమస్యల గురించి ప్రజలలో మమేకమైంది ఎప్పుడూ లేదు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించలేదని ఆరోపణలూ ఉన్నాయి.అప్పుడు ఆ వెలితిని వైయస్, ఆయన చిన్నాన్న వైయస్ వివేకానంద తీర్చారు. పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ వ్యాపారలావాదేవీలకే జగన్ పరిమితమయ్యాడనే వారున్నారు. వైయస్ చనిపోయాక ఆయన ఇమేజ్ తో ముఖ్యమంత్రి గద్దెనెక్కుదాం అనుకుంటే అదీ బెడిసి కొట్టింది.
ఆ స్థానం కోసమే ఆయన ఓదార్పు చేపట్టారని, ఇప్పుడు పార్టీ పెట్టడానికీ కారణం అదేనంటున్నారు ఆయన వ్యతిరేకులు. జగన్ పెట్టే పార్టీ తన కోరికను తీర్చేదిగా ఉండాలంటే ప్రజలు ఆమోదం కావాలి. దానికి తండ్రి ఇమేజ్ ఒక్కటే సరిపోదు. కాబట్టే ఆయన ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలపై దృష్టి పెట్టాలనుకున్నట్టున్నారు. అందులో భాగంగానే శుక్రవారం, శనివారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని తెనాలి, ఆవనిగడ్డ వంటి వర్షాభావ ప్రాంతాలలో పర్యటించాలని నిశ్చయించుకున్నట్టున్నారు. ప్రజల మధ్య ఓదార్పు చేపట్టినప్పటికీ ఆయన దానిని ఎందుకు చేపట్టారో అందరికీ తెలిసిందే.