ఎట్టకేలకు పలమనేరు అడవి ఏనుగు పట్టివేత.. నెల రోజుల ఆపరేషన్ సక్సెస్
గత కొంత కాలంగా పలమనేరు పరిసరాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తూ, సమీప గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒంటరి మగ అడవి ఏనుగును ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ తాజాగా విజయవంతంగా బంధించింది. ఈ ఏనుగును బంధించేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులతో పాటు క్షేత్ర స్థాయి సిబ్బంది నెల రోజులకుపైగా కష్టపడాల్సి వచ్చింది.
సుమారు 15 నుంచి 18 సంవత్సరాల వయసు కలిగిన ఈ ఏనుగును వన్యప్రాణి సంరక్షణ చట్టాలకు లోబడి, పశు వైద్య నిపుణులు, అటవీశాఖ ఫీల్డ్ సిబ్బంది పర్యవేక్షణలో బంధించారు. బుధవారం నిర్వహించిన తుది ఆపరేషన్ లో ముసలమడుగు క్యాంపు నుంచి వచ్చిన ఐదు కుంకీ ఏనుగులు కూడా పాల్గొని, ఏనుగుని బంధించడంలో కీలకపాత్ర పోషించాయి.
గతంలో ఈ ఏనుగు దాడిలో గాయపడిన అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొనడం గమనార్హం. అత్యంత చాకచక్యంగా ఆపరేషన్ నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసిన పీసీసీఎఫ్ పీవీ చలపతిరావు, అటవీశాఖ సిబ్బందిని, అనంతపురం సర్కిల్ కన్జర్వేటర్ యశోదా బాయ్, చిత్తూరు జిల్లా అటవీ అధికారితో పాటు పశువైద్య నిపుణులు, ట్రాకర్లు, మహౌత్ లను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు.
గతంలో ఏనుగు దాడిలో గాయపడినప్పటికీ, కోలుకుని ఈ ఆపరేషన్లో పాల్గొన్న సుకుమార్ ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. ప్రజల భద్రత, వన్యప్రాణి సంరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అటవీశాఖ చేపట్టిన ఆపరేషన్ ను ప్రశంసించారు. పట్టుకున్న ఈ ఏనుగును ముసలమడుగు క్యాంపుకి తరలిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలపగా, కుంకీగా శిక్షణ ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని పవన్ కల్యాణ్ సూచించారు.
ఈ ఏనుగు పలమనేరు సమీప ప్రాంతాల్లో సంచరిస్తూ పదే పదే పంటలను ధ్వంసం చేయడంతోపాటు పరిసర గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. పలుమార్లు జనావాసాల మధ్యకు రాగా, గతంలో చేపట్టిన మళ్లింపు చర్యల్లో పలమనేరు అటవీ విభాగానికి చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ పై దాడి చేసి, తీవ్రంగా గాయపర్చింది.
పంటలకు నష్టం కలిగించడం, ప్రజల భద్రత దృష్ట్యా ఈ ఒంటరి మగ ఏనుగును బంధించాల్సి వచ్చింది. అందుకోసం సుదీర్ఘకాలం ఏనుగు కదలికలను క్షేత్ర స్థాయి అటవీ సిబ్బంది, ట్రాకర్ల సాయంతో పర్యవేక్షించారు. అప్పట్లో అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసినా తర్వాత ఏనుగు ప్రవర్తనలో మార్పు రావడాన్ని గుర్తించారు. అధునాతన డ్రోన్లు, థర్మల్ సెన్సార్ కెమెరాల సాయంతో నెల రోజులుగా ఏనుగు కదలికలను ట్రాక్ చేశారు. గతంలో ఏనుగు దాడి చేసిన సెక్షన్ లోనే జాతీయ రహదారికి సమీపంలో పట్టుకున్నారు.
వన్యప్రాణి నిర్వహణ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, పీసీసీఎఫ్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఏనుగుకు మత్తుమందు ఇచ్చే ప్రక్రియను డాక్టర్ నవీన్, అరుణ్ లు సమన్వయం చేయగా, విశ్రాంత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రఘునాథ్ ఆపరేషన్ అనంతర కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించారు. అనంత సర్కిల్ కన్జర్వేటర్ ఆపరేషన్ ను స్వయంగా పర్యవేక్షిస్తూ కీలక సూచనలు ఇచ్చారు.

ఉపముఖ్యమంత్రి సూచన మేరకు పట్టుకున్న ఏనుగును ముసలమడుగు కుంకీ శిబిరానికి తరలించారు. అక్కడ పశువైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం, ఏనుగు ప్రవర్తనను కొంతకాలం పర్యవేక్షిస్తారు. మనుషులతో మెలిగే అంశంలో సానుకూల దృక్పథం కనబరిస్తే ప్రత్యేక శిక్షణ ఇచ్చి కుంకీగా తీర్చిదిద్దుతారు.














Click it and Unblock the Notifications