తేల్చుకుందాం, రండి: మైక్రో ఫైనాన్స్ లపై ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్
మైక్రో ఫైనాన్స్ లపై ఆర్డినెన్స్ అమలులో ఉన్నందున ఇప్పుడే బిల్లు ప్రతిపాదించాల్సిన అవసరం లేదని, ముందు రైతు సమస్యలపై చర్చ జరగాలని చంద్రబాబు అన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయిందని, అందుకే బిల్లును అడ్డుకుంటోందని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. మేం రాజీపడ్డామో, మీరు రాజీపడ్డామో తేల్చుకుందామని చంద్రబాబు అన్నారు. మైక్రో ఫైనాన్స్ లకు ప్రజలు ఒక్క రూపాయి కూడా కట్టవద్దని తాము ప్రజలకు చెప్పామని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మైక్రో ఫైనాన్స్ సంస్థలు వచ్చాయని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థ ఎస్కెస్ అధిపతి ఆకుల విక్రమ్ కు, కాంగ్రెసు ప్రధాన కార్యదర్సి రాహుల్ గాంధీకి మధ్య ఉన్న సంబంధాలు అందరికీ తెలుసునని తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని, వడ్డీ నియంత్రణ నిబంధన లేకపోవడం బిల్లులో పెద్ద లోపమని తెలుగుదేశం సభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు.