హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ జలదీక్షకు వెళ్లినవారిపై ఏ విధమైన చర్యలుండవా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఢిల్లీలో చేసిన జలదీక్షకు వెళ్లిన పార్లమెంటు సభ్యులపై గానీ శాసనసభ్యులపై గానీ ఏ విధమైన చర్యలు ఉండకపోవచ్చుననే మాట వినిపిస్తోంది. జగన్ దీక్షకు వెళ్లినవారిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారని అడిగితే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఏ విధమైన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. దీన్ని బట్టి వారిపై చర్యలు తీసుకునే సాహసానికి కాంగ్రెసు అధిష్టానం ఒడిగట్టకపోవచ్చునని అనిపిస్తోంది. తాను తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుందని, తన శాసనసభ్యుల అవసరం కాంగ్రెసుకు ఉందని, అందువల్లనే వారిపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకోవడం లేదని వైయస్ జగన్ చెప్పిన విషయాన్ని కాంగ్రెసు తీరు ధ్రువీకరిస్తోంది.

కాగా, కాంగ్రెసు నాయకత్వాన్ని రెచ్చగొట్టడానికే జగన్ ఆ విధంగా అన్నారనే మాట కూడా వినిపిస్తోంది. మొదటి నుంచి కూడా శాసనసభ్యులపై, పార్లమెంటు సభ్యులపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకోవడం లేదు. శాసనసభ్యురాలు కొండా సురేఖకు నోటీసులు జారీ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, తనకు ఏ విధమైన నోటీసులు రాలేదని ఆమె చెప్పారు. శాసనసభ్యులు కానటువంటి నాయకులపై మాత్రం కాంగ్రెసు నాయకత్వం చర్యలు తీసుకుంది. చెవిరెడ్డి భాస్కర రెడ్డి, అంబటి రాంబాబులపై చర్యలు తీసుకుంది. అయితే, మిగతావారిని భయపెట్టడానికి మాత్రమే ఆ చర్యల తతంగం నడిపించినట్లు భావిస్తున్నారు.

వైయస్ జగన్ పార్టీలో ఉన్నప్పుడే కాకుండా పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా కాంగ్రెసు నాయకత్వానికి కొరకరాని కొయ్యగానే తయారయ్యారు. పార్టీ నుంచి వెళ్లిపోతే తలనొప్పి తగ్గుతుందని భావిస్తే ఏదో ఒక విధమైన కార్యక్రమంతో కాంగ్రెసు అధిష్టానానికి సవాల్ విసురుతూనే ఉన్నారు. విజయవాడలో జరిగిన లక్ష్యదీక్షలో, ఢిల్లీలో చేసిన జలదీక్షలో వైయస్ జగన్ కాంగ్రెసు అధిష్టానానికి సవాల్ విసిరారు. దాన్ని స్వీకరించే స్థితిలో కాంగ్రెసు అధిష్టానం లేకుండా పోయింది. జగన్ వెంట వెళ్లడం పార్టీ వ్యతిరేక చర్యనే అవుతుందని, చర్యలు తీసుకుంటామని జలదీక్షకు ముందు డి. శ్రీనివాస్ హెచ్చరికలు పనిచేయలేదు. పైగా ఇటువంటి హెచ్చరికలు ఉట్టివేనని వారి అనుభవంలోకి కూడా వస్తోంది. జగన్ వెంట వెళ్లినవారిపై పార్టీ అధిష్టానం తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని డిఎస్ చెప్పారు. ఏ విధమైన చర్యలు తీసుకుంటారని అడిగితే సమాధానం చెప్పలేదు. అలాంటివారిపై చర్యలుంటాయని, అయితే చర్యల్లో జాప్యం జరగవచ్చునని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చర్యలు తీసుకోవడానికి పార్టీ నాయకత్వం వెనకాడుతోందనే విషయం మాత్రం స్పష్టం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X