వైయస్ జగన్ దెబ్బకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విలవిల
జగన్కు 24 మంది కాంగ్రెసు శాసనసభ్యుల మద్దతు, ఇద్దరేసి తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుల మద్దతు ఉందని అంచనాలు వస్తున్నాయి. ఇంత మంది శాసనసభ్యులు జగన్ వెంట వెళ్లినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్లేనని భావిస్తున్నారు. ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు విమర్శిస్తున్నారు.
శాసనసభ మొత్తం సీట్ల సంఖ్య 294 కాగా, వైయస్ విజయమ్మ రాజీనామాతో ప్రస్తుతం 293 మంది శాసనసభ్యులున్నారు. మెజారిటీకి 148 సభ్యుల మద్దతు అవసరం. అయితే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి 132 మంది సభ్యుల బలం మాత్రమే ఉందని చెబుతున్నారు. మరో 16 మంది సభ్యుల మద్దతు ప్రభుత్వానికి అవసరం. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డిని మజ్లీస్కు చెందిన ఏడుగురు శాసనసభ్యులు కలిశారు.
ఆపద్బాంధవుడు చిరంజీవి మద్దతు ఎలాగూ ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీకి చెందిన 18 మంది సభ్యుల్లో ఇద్దరు జగన్ వెంట వెళ్లగా, మరో ఇద్దరు తెలంగాణ సభ్యులు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన 14 మంది శాసనసభ్యుల మద్దతు తమకు లభిస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి అంచనా వేసుకుంటున్నారు. మజ్లీస్, ప్రజారాజ్యం పార్టీల మద్దతుతో గట్టెక్కవచ్చుననేది కాంగ్రెసు అధిష్టానం అంచనా. ప్రభుత్వాన్ని కాపాడుకునే వీలుందనే కాంగ్రెసు అధిష్టానం ఆశలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఉదంతం కూడా ఊతం ఇస్తోంది. జగన్ వెంట వెళ్లే శానససభ్యులపై అనర్హత వేటు పడుతుందని, తద్వారా ప్రభుత్వాన్ని గట్టెక్కించుకోవచ్చునని కాంగ్రెసు అధిష్టానం లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. పార్టీపై విమర్శలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడుతుందని పిసిసి క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు మాటల్లోని ఆంతర్యం అదేనని అంటున్నారు. దీనివల్లనే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వైయస్ జగన్ వెనకాడుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది.
మరింత మంది శాసనసభ్యులు తన వెంట వస్తే ఫిరాయింపుల చట్టం కింద చర్యలను అధిగమించవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇంకా మనుగడ సాగిస్తోందనే ప్రచారం జరుగుతోంది. అయితే, జగన్ ఏమైనా తెలంగాణ అంశం కలిసి వస్తుందేమోననే ఆశ ఉంది. తాము ప్రభుత్వాన్ని పడగొట్టబోమని, తెలంగాణ అంశం మీద ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు. దీన్నిబట్టి వైయస్ జగన్ ఆశలు తెలంగాణ గందరగోళంపైనే ఆధారపడి ఉన్నట్లు చెప్పుకోవచ్చు.