సీమాంధ్ర ఎంపీలకు హైకమాండ్ పిలుపు: తెలంగాణపై తేల్చేయడానికే?
తెలంగాణ అంశంపై కేంద్రం నాన్చకూడదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా హోంశాఖ త్వరలో అఖిలపక్షం చివరి భేటీని నిర్వహించబోతోంది. ఒకటి రెండు రోజుల్లో తేదీ ఖరారు కానుంది.26లోపు భేటీ ఉంటుందని హోంశాఖ ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. "ఇప్పుడు నిర్వహించబోయే సమావేశమే చివరిది. ఆ తర్వాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది. ఈ అంశాన్ని మరి కొంతకాలం కొనసాగించే ఉద్దేశం మాకులేదు" అని సంబంధిత వర్గాలు సోమవారం స్పష్టం చేశాయి. 26 లోపు అఖిలపక్షం జరిగితే ఆ తర్వాత 28,29 తేదీల్లో జరిగే కాంగ్రెస్ కోర్కమిటీలో తుది నిర్ణయానికి రావచ్చని సమాచారం. అనంతరం శ్రీకృష్ణ కమిటీ నివేదికను మంత్రివర్గంలో పెట్టి ఆమోదించనున్నట్లు తెలిసింది.
అఖిలపక్షంలోనే కేంద్రం తన వైఖరిని చూచాయగానైనా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ అభిప్రాయాన్ని కోరడానికి ముందు కేంద్ర ప్రభుత్వం స్థిరమైన అభిప్రాయంతో రావాలని 6వ తేదీ నాటి సమావేశంలో సీపీఐ, సీపీఎం, ప్రజారాజ్యం, ఎంఐఎం డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి చిదంబరం మౌనముద్ర వీడతారని వాదన వినిపిస్తోంది. సోమవారం సాయంత్రం ఆయన నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అఖిలపక్షం తేదీలపై కసరత్తు జరిగినా తుది నిర్ణయానికి రాలేదని తెలిసింది. అయితే 23, 24 తేదీల్లో ఏదో ఒక రోజును ఖరారు చేయొచ్చని సమాచారం. ఇందులో భాగంగానే తమ పార్టీకి చెందిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో కాంగ్రెసు అధిష్టానం చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ అంశాన్ని తేల్చేయాలని ఈనెల 14న జరిగిన కోర్ కమిటీ భేటీలోనే కాంగ్రెస్ ఒక నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 21న మరోసారి చర్చించి ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. అక్కడ తీసుకున్న నిర్ణయాన్నే అఖిలపక్ష సమావేశంలో హోంమంత్రి వెల్లడించొచ్చంటున్నారు. అఖిలపక్షం స్పందనను బట్టి 28,29 తేదీల్లో కాంగ్రెస్ కోర్ కమిటీ తుది నిర్ణయానికి వస్తుందని చెబుతున్నారు.