"ఓడించలేక, విభజించే యత్నం"-ఇరానీయులకు ఖమేనీ హైబ్రిడ్ వార్ అలర్ట్..!
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ఏకపక్షంగా ప్రారంభించిన యుద్దం నాలుగు నెలలు దాటిపోయింది. అయినా పూర్తిగా యుద్దం ఎప్పుడు ఆగుతుందో, ఉద్రిక్తతలు ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్ధితి నెలకొంది. ఓవైపు ట్రంప్ యుద్ద అధికారాలకు కోతలు వేస్తూ అక్కడి చట్టసభలు నిర్ణయాలు తీసుకుంటున్నా.. ఇంకా ఆయన హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ కూడా అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మెజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei)స్పందించారు.
అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్య ద్వారా తమ లక్ష్యాలను సాధించడంలో విఫలమై, ఇప్పుడు ఇరాన్లో విభేదాలు సృష్టించే ప్రయత్నాలకు దిగాయని మెజ్తబా ఖమేనీ ఆరోపించారు. ఇవాళ విడుదల చేసిన ఓ లిఖితపూర్వక సందేశంలో ఖమేనీ.. అమెరికా నేతృత్వంలోని "అణచివేత వ్యవస్థ" బలమైన, స్వతంత్ర ఇరాన్ను సహించలేదన్నారు. ఇజ్రాయెల్ను ఆ వ్యవస్థ యొక్క కల్పిత ముందస్తు స్థావరంగా అభివర్ణించారు.

సైనికంగా విఫలమై, తీవ్ర అవమానాన్ని చవిచూసిన శత్రువు, ఇప్పుడు రెండు అంశాలపై దృష్టి సారించి హైబ్రిడ్ యుద్ధం చేస్తోందని తెలిపారు. ప్రజల సహనం, అధికారుల తప్పుడు అంచనాలు. సందేహం, నిరాశ, భయం, విభజనలను విత్తడమే వారి ప్రాథమిక సాధనమని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యల పట్ల ఆయన హెచ్చరికలు చేశారు. ప్రజలలో అపనమ్మకాన్ని లేదా నిరాశను కలిగించే ఏ చర్య అయినా ఈ దేశానికి, దాని ప్రజలకు శత్రువుకు సహాయం చేయడమే అన్నారు.
ఈ సవాళ్లను "స్థిరత్వం, స్పష్టమైన దృష్టి మరియు ఐక్యతతో" ఎదుర్కోవాలని ఆయన ఇరానీయులకు పిలుపునిచ్చారు. యుద్ధభూమిలో విఫలమైన తర్వాత, ఇరాన్ శత్రువులు ఇప్పుడు ప్రజల స్థైర్యాన్ని దెబ్బతీయడానికి, దేశంలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.














Click it and Unblock the Notifications