భాను కిరణ్ అడ్డా బాలాజీ ల్యాబ్, సూరి సెటిల్మెంట్లు ఇక్కడి నుంచే
సూరి, భానుకిరణ్ లతో కళ్యాణ్కు సంబంధాలు ఏర్పడటానికి ప్రధాన కారణం హైదరాబాద్ శివారు ఖాజాగూడలో 4 ఎకరాల స్థలమని అంటున్నారు. తొమ్మిదేళ్ల క్రితం ఆ స్థలం యజమానిని బెదిరించి సూరి పేరుతో భానుకిరణ్ అండ్కో ఆక్రమించుకుంది. ఆ స్థలం యజమానికి నానక్రాంగూడలో 10 ఎకరాల భూమి ఉంది. దీన్ని అప్పట్లో నిర్మాతల మండలి కార్యదర్శిగా ఉన్న కళ్యాణ్ మండలి తరఫున కొనుగోలు చేశారు. ఆ సందర్భంగా స్థలం యజమాని ఖాజాగూడలో నాలుగు ఎకరాల విషయాన్ని కళ్యాణ్కు చెప్పగా, తాను న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఇదే విషయంలో సూరి, భానుకిరణ్లతో కళ్యాణ్కు సంబంధాలు ఏర్పడ్డాయి. అనంతరం వీరితో శింగనమల రమేష్ కలిశారు. వీరంతా కలిసి ఏడేళ్ల క్రితం బాలాజీ కలర్ ల్యాబ్ను ఫిలింనగర్లో ప్రారంభించారు. రియల్ లావాదేవీలు, సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన సొమ్మును పెట్టుబడిగా పెట్టి సినిమాలకు ఫైనాన్స్ చేయడం మొదలు పెట్టారు. లాభాలు బాగా రావడం, రియల్బూమ్ ఉండటంతో ఆ డబ్బుతో మాదాపూర్, కొండాపూర్, నానక్రాంగూడ, మదీనాగూడ వంటి ప్రాంతాల్లో స్థిరాస్థులను కొనుగోలు చేశారు. వీటిలో కొన్నింటిని శింగనమల రమేష్ కొనుగోలు చేశారు.
చిన్న చిత్రాలకు ఫైనాన్స్ ఇచ్చే ల్యాబ్గా మొదలైన బాలాజీ కలర్ ల్యాబ్ ప్రస్థానం మూడేళ్లుగా ఊపందుకుంది. గత ఏడాది విడుదలైన నాలుగు భారీ చిత్రాలకు ఈ ల్యాబ్ ఫైనాన్స్ చేసింది. ప్రస్తుతం భానుకిరణ్తో సన్నిహిత సంబంధాలున్న ఒక న్యాయవాది నిర్మిస్తున్న సినిమాసహా ప్రముఖ నటులు, మరో రెండు నెలల్లో విడుదలవుతున్న ఆరు చిత్రాలు కలిపితే మొత్తం 30 సినిమాలకు ఈ ల్యాబ్ ఫైనాన్స్ చేస్తోందని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కొన్ని డాక్యుమెంట్లను సేకరించినట్లు తెలిసింది.