వైయస్ జగన్ సాక్షిపై చంద్రబాబు ఫైర్, అవినీతికి సాక్షి అని ఆరోపణ
రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని, నిరసనలు తెలపాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయనే జగన్ వర్గం విమర్శలను ఆయన ఖండించారు. తమపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెసుకు గానీ జగన్ వర్గానికి గానీ లేదని ఆయన అన్నారు. జగన్ వర్గం అంటూ ఒకటి ఉందా అని ఆయన ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామంటే ఎందుకంటూ రాద్ధాంతం చేస్తారని, ప్రతిపాదించకపోతే ఎందుకు ప్రతిపాదించలేదని అంటారని ఆయన అన్నారు. ఎప్పుడు ఏం చేయాలో తమకు తెలుసునని, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నడుచుకుంటామని ఆయన అన్నారు.
జగన్ వర్గంపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఒక పార్టీలో ఉన్నవారు రాజీనామాలు చేయకుండా మరొకరు పార్టీ పెడితే అటు వైపు ఎలా వెళ్తారని ఆయన అడిగారు. వారిని చూస్తే జాలి వేస్తోందని ఆయన అన్నారు. స్థాయి లేనివారు సలహాలు, సూచనలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దేశంలోనే ఎక్కువ అవినీతికి పాల్పడినవారు చెప్తే వినాలా అని ఆయన అడిగారు. దేశంలో అవినీతి పెరిగిపోయిందని ఆయన అన్నారు. బ్లాక్ మనీ, 2జి స్పెక్ట్రమ్ స్కామ్లపై సుప్రీంకోర్టు చొరవను ఆయన అభినందించారు.