ఘోరం: రెండు బస్సులు ఢీ.. 10 మంది మృతి.. 40 మందికి సీరియస్
ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఒకదాన్నొకటి ఢీ కొని 10 మంది మృతి చెందారు. అనేకమంది గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్ రాష్ట్రం, సూరత్ జిల్లాలోని బార్డోలీ తహసీల్ పరిధిలో ఉవా గ్రామం వద్ద చోటుచేసుకుంది.
మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు సూరత్ నుంచి ధూలే వైపు వెళ్తుండగా.. బార్దోలీ తాలుకాలోని ఉవా గ్రామం సమీపంలో ఓ బస్సు ప్రమాదవశాత్తు రోడ్డుపై ముందుగా వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో బస్సు నియంత్రణ కోల్పోయింది. అలా వేగంగా సెంట్రల్ డివైడర్ ను దాటి అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లింది. అదే సమయంలో అటు నుంచి ఎదురుగా వస్తున్న మరొక మహారాష్ట్ర ప్రభుత్వ బస్సును బలంగా ఢీ కొట్టింది.
ఆ తర్వాత ఒక బస్సు రోడ్డు పక్కన ఉన్న లోతట్టు ప్రాంతంలోకి బోల్తా పడింది. బోల్తా పడిన వెంటనే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. దాంతో లోపలే ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. అలా 10 మంది ప్రయాణికులు బస్సులోనే సజీవదహనం అయ్యారు. మిగతా ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 40 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

ఇక ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి మరణించినవారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50 వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు పీఎంఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.












Click it and Unblock the Notifications