కింది స్థాయిలో ఇరు పార్టీల సమన్వయంపై చిరుకు చిక్కులే
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ శాసనసభా స్థానంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి మహేశ్వర రెడ్డి గెలుపొందారు. అక్కడ సీనియర్ నాయకుడు ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ప్రజారాజ్యం నుంచి గెలిచిన అనిల్ కుమార్కు కెఆర్ సురేష్ రెడ్డి ఉన్నారు విజయవాడ తూర్పులో ప్రజారాజ్యం నుంచి గెలిచిన యలమంచిలి రవి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడే మాజీమంత్రి దేవినేని నెహ్రూ కాంగ్రెస్కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇరువురికీ నియోజక వర్గంలో రెండు బలమైన వర్గాలున్నాయి. ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య పోరు సాగుతోంది. ఇప్పుడు ఒక్కసారిగా వారి మధ్య సమన్వయం కుదర్చటం కష్టమే. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఎవరికి కేటాయించాలన్న దానిపైనా సమస్య ఎదురయ్యే అవకాశముంది.
విజయవాడ సెంట్రల్ నుంచి కాంగ్రెస్ తరపున మల్లాది విష్ణు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ప్రజారాజ్యం తరపున పోటీచేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు బలమైన వర్గముంది. ఇకపై నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం ఇరు వర్గాల మధ్య పోటీ తప్పదు. కిందటి ఎన్నికలకు ముందునుంచీ వీరి మధ్య విభేదాలున్నాయి. మచిలీపట్నం నుంచి కాంగ్రెస్ తరపున పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తుండగా, అక్కడ ప్రజారాజ్యం తరపున పోటీచేసి ఓడిన బూరగడ్డ వేదవ్యాస్కి బలమైన వర్గముంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి ప్రజారాజ్యం తరపున ఈలి నాని ప్రాతినిధ్యం వహిస్తుండగా, అక్కడ కాంగ్రెస్కి మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వీరు ఇరువురి మధ్య విభేదాలున్నాయి.