అధిష్టానం హెచ్చరికలు బేఖాతరు: ఢిల్లీలోనే టి-కాంగ్రెసు ఎమ్మెల్యేలు
గురువారం నుండి బడ్జెట్ సమావేశాలు ఉన్న దృష్ట్యా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లి సమావేశాలలో పాల్గొనవల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ వారిని హైదరాబాద్ వెళ్లి పోవాల్సిందిగా చెప్పారు. మనీష్ తివారి ఢిల్లీ వెళ్లి పోవాల్సిందిగా హెచ్చరించినట్లుగా కూడా సమాచారం. అయితే వీరి హెచ్చరికలను ఎమ్మెల్యేలు మాత్రం బేఖాతరు చేస్తూ ఢిల్లీలోనే సోనియా నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఉండాలనే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తమ ప్రాంతంలోని పరిస్థితుల నేపథ్యంలోనే మేం అధిష్టానం ముందుకు వచ్చామని ఆషామాషీగా రాలేదని వారు చెబుతున్నారు. అయితే వారికి సోనియా అపాయింట్మెంట్ దొరకక పోవడం కలవరం కలిగిస్తోంది.
కాగా గురువారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థికశాఖామాత్యులు ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ కానున్నారు. ప్రణబ్తో బేటీ అనంతరం కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్ బయలు దేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రణబ్ ముఖర్జీ వారితో తెలంగాణపై త్వరలో అఖిలపక్షాన్ని రెండోసారి పిలుస్తామని, అప్పటి వరకు ఓపిక పట్టాలని చెప్పే అవకాశముంది.