గీత, చేనేత కార్మికులకు కొత్త పింఛన్లు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలోని నేత కార్మికులకు, గీత కార్మికులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన చేనేత మరియు గీత కార్మికులకు అందరికీ సంతృప్త స్థాయిలో కొత్త పింఛన్లు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం ఆవిష్కరించారు.
బహుజనులకు ప్రభుత్వ సంక్షేమం
ఈ సందర్భంగా CM మాట్లాడుతూ... బహుజనుల హక్కుల పోరాటంలో పాపన్న గౌడ్ వీరుడని కొనియాడారు. ట్యాంక్బండ్కు వచ్చే ప్రతీ పర్యాటకుడికి స్పష్టంగా కనిపించేలా ఈ స్థలాన్ని తానే స్వయంగా ఎంపిక చేశానని తెలిపారు. ఇదే సమయంలో బహుజనులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను గురించి వెల్లడించారు. గౌడ సమాజానికి ఇప్పటికే 50 వేల కాటమయ్య కిట్లు పంపిణీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

గీత కార్మికులకు బీమా, వృత్తిని కాపాడే ప్లాన్
ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత వృత్తిని కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. నీటిపారుదల కాలువల గట్లపైన ఈత, తాటి చెట్లను నాటాలని సంబంధిత శాఖ మంత్రికి సూచనలు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సర్వాయి పాపన్న తెలంగాణా ప్రజలకు ఆదర్శం
సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల నుంచి పుట్టిన వీరుడని కొనియాడిన రేవంత్ రెడ్డి, ఆయన పోరాట స్ఫూర్తి తెలంగాణ ప్రజలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆగస్టు 22న సాయన్న జయంతిని కూడా అధికారికంగా నిర్వహిస్తామని రేవంత్ ప్రకటించారు. కులవృత్తులను గౌరవించాలని ఇదే సమయంలో పిల్లలను తప్పనిసరిగా చదివించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
సామాజిక న్యాయం కోసం బీసీ కులగణన, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ
ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలకు కావలసిన అన్ని వసతులను కల్పించామని, నాణ్యమైన భోజనం, పాలు, రాగిజావ అందిస్తున్నామని తెలిపారు. ఏటీసీలలో చేరిన విద్యార్థులకు నెలకు ₹2000 ఉపకార వేతనం ఇస్తున్నామన్నారు. సామాజిక న్యాయం కోసం బీసీ కులగణన, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం బహుజనుల తెలంగాణను నిర్మిస్తుందని రేవంత్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications