ఢిల్లీ వెళ్లొచ్చాక రాజీనామా ఆలోచన: తెలంగాణ మంత్రుల నిర్ణయం!
రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తున్న సహాయ నిరాకరణపై త్వరలో హై కమాండ్కు లేఖ రాస్తామని చెప్పారు. సహాయ నిరాకరణను విరమింపజేసేలా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రానికి కట్టుబడి ఉందన్నారు. మేం తెలంగాణ తప్ప మరే పరిష్కారాన్ని ఆమోదించేది లేదని సీనియర్ నాయకులు కే కేశవరావు చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
సమావేశంలో మంత్రి జానారెడ్డి రాజీనామా చేస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే మిగతా మంత్రులు తొందరపడి రాజీనామాలు చేయవద్దని వారించినట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజీనామాలు చేసి పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని సూచించినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ కార్యక్రమంలో మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జూపల్లి కృష్ణారావు, రాంరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, కె కేశవరావు తదితరులు పాల్గొన్నారు.