వణికిస్తున్న పెద్దపులి.. పాపికొండలుకు నో పర్యాటకులు!
పాపికొండల పరిధిలో పెద్దపులి కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా దేవీపట్నం ప్రాంతంలో పెద్ద పులి సంచారం కారణంగా స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దేవీపట్నం మండలంలోని గిరిజన గ్రామాల ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. . ప్రస్తుతం పెద్దపులి పరగసానిపాడు, కూడిపల్లి, బోడిగూడెం వంటి పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.
పులిని పట్టుకోవటానికి అటవీశాఖ ప్రయత్నాలు
పులి బయట ఉన్న పశువులను చంపి తింటున్న క్రమంలో జనావాసాలకు దగ్గరగా తిరుగుతున్న తీరుతో స్థానిక గిరిజనులు గడగడలాడిపోతున్నారు. ఈ పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు అధికారులు గతంలో దానికి అమర్చిన శాటిలైట్ రేడియో కాలర్ (జీపీఎస్ పరికరం) సిగ్నల్స్ను నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. వీటితో పాటు రాత్రి వేళల్లో కూడా స్పష్టమైన చిత్రాలను తీయగల అత్యాధునిక థర్మల్ డ్రోన్ కెమెరాలను రంగంలోకి దించారు.

రంగంలోకి ప్రత్యేక హనుమాన్ టీమ్స్
దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పులిని గుర్తించడం, పట్టుకోవడం రెస్క్యూ బృందాలకు పెద్ద సవాలుగా మారింది. వన్యప్రాణి నిపుణులు, పశువైద్యులతో కూడిన ప్రత్యేక 'హనుమాన్ టీమ్స్' అడవిలో మకాం వేసి, రాత్రి ఒంటి గంటల సమయం వరకు కాపు కాసినప్పటికీ పులి ఇంకా బోనుకు చిక్కలేదు. పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా దేవీపట్నంలోని ప్రసిద్ధ గండిపోచమ్మ ఆలయానికి వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.
పాపికొండలుకు తగ్గిన పర్యాటకులు
పోలవరం పనులు చేసే కార్మికులు కూడా పెద్దపులి సంచారం నేపధ్యంలో పనుల్లో ఉత్సాహంగా పాల్గోలేకపోతున్నారు. సాధారణంగా వేసవి మరియు వారాంతాల్లో పాపికొండల అందాలను వీక్షించేందుకు తరలివచ్చే సందర్శకుల సంఖ్య ఈ ఆంక్షల వల్ల గణనీయంగా తగ్గిపోయింది. పర్యాటక బోట్లు మరియు రాకపోకలపై పర్యవేక్షణ పెంచారు.
వారికి అటవీశాఖాధికారుల హెచ్చరిక
గిరిజన గ్రామాల్లోని ప్రజలు రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు రావద్దని, పశువులను అడవి పరిసరాల్లోకి తోలవద్దని ఉన్నతాధికారులు హెచ్చరించారు. పులిని సురక్షితంగా మత్తుమందు ఇచ్చి బంధించే వరకు ఈ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతుందని అటవీ శాఖ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications