విద్యార్థుల చలో అసెంబ్లీ ఉద్రిక్తం, లాఠీచార్జ్: గద్దర్ అరెస్టు
పోలీసులు సాధ్యమైనంతంగా హింసాయత్నాలు లేకుండా విద్యార్థులను అడ్డుకునే వ్యూహంలో భాగంగా సాధ్యమైనంత ఎక్కువమంది పోలీసులను మోహరించారు. మరో విద్యార్థి భాగం మహిళా హాస్టల్ మీదుగా మెయిన్ గేటు వద్దకు చేరుకున్నారు. పోలీసులు గేటు మూసివేసి విద్యార్థులను అడ్డుకున్నారు. పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు పోలీసులు గోబ్యాక్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఎన్సిసి గేటు వద్ద విద్యార్థినుల ర్యాలీనీ పోలీసులు అడ్డుకున్నారు.
కాగా యూనివర్శిటీనుండి బయలుదేరితే పోలీసులు అడ్డుకుంటారనే వ్యూహంలో భాగంగా విద్యార్థులు ముందుగానే కొందరు బయటకు వెళ్లి అసెంబ్లీ ముట్టడికి బయలు దేరారు. బషీర్బాగ్ నుండి కాకతీయ యూనివర్శిటీ విద్యార్థులు సుమారు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సిఎం క్యాంప్ కార్యాలయం వద్ద కూడా పలువురు విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. నిజాం కళాశాల హాస్టల్ నుండి సైతం బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలి వేశారు.