వైయస్ జగన్ను శత్రువుగా చూస్తున్నారా, ప్రభుత్వంపై ధ్వజం
ఫీజు రీయంబర్స్మెంట్ కోసం వైయస్ జగన్ చేపట్టిన దీక్ష గురువారం ఏడో రోజుకు చేరుకుంది. వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రభుత్వం శత్రువు కంటే హీనంగా చూస్తోందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. 26 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ గత వారం రోజులుగా జగన్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. పేద విద్యార్థుల కోసం ఆరు రోజుల నుంచి నిరశన దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం క్షీణించినా ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దారుణంగా ఉందన్నారు. శత్రువు పట్ల కూడా ఎవరూ ఈ విధంగా ప్రవర్తించరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రజలంతా పట్టించుకున్నారని, అదే చాలని సికింద్రాబాద్ కాంగ్రెసు శాసనసభ్యురాలు జయసుధ అన్నారు. వైయస్ జగన్ను ప్రతిపక్ష నేతగా భావించి ఉంటే ప్రభుత్వం తన ప్రతినిధులను పంపి దీక్ష విరమించాలని కోరేదని వారంటున్నారు. కానీ, ప్రభుత్వం జగన్ దీక్షను ఏ మాత్రం పట్టించుకోలేదు.