తెలంగాణపై మారని బాబు మాట, రెండు ప్రాంతాల నేతలకు స్వేచ్ఛ
కాంగ్రెసు పార్టీ ప్రజారాజ్యం పార్టీని కలుపుకుందని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను కలిపితే తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు పార్టీ వారు అంటున్నారని, రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెసు పనిచేస్తోందని, సమస్యను పరిష్కారం చేసే ఉద్దేశంతో లేదని ఆయన అన్నారు. ప్రతి రాజకీయ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ఇతర రాజకీయ పార్టీలపై దాడి చేయడం అన్యాయమని ఆయన అన్నారు. చెప్పుకునే అవకాశమే లేదా అని ఆయన అడిగారు. పార్టీలు తమ తమ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తాయని ఆయన అన్నారు. వైయస్ జగన్తో తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కుమ్మక్కయ్యారని, పరస్పరం ప్రశంసించుకుంటున్నారని ఆయన అన్నారు. ఎందుకు కెసిఆర్ జగన్ను ప్రశంసిస్తున్నాడో తెలియదని ఆయన అన్నారు.
తెలంగాణను, హైదరాబాదును అభివృద్ధి చేసింది తమ ప్రభుత్వమేనని ఆయన చెప్పుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి తాము తీసుకున్న చర్యల ఫలితాలు అంది వస్తున్న తరుణంలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఇష్టప్రకారం దోచి పెట్టాడని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ కన్సల్టెన్సీలతో ఒప్పందాలు, ఆస్తుల అమ్మకం, ఖనిజ సంపదను దోచి పెట్టడం, జలయజ్ఞం ద్వారా రాష్టాన్ని దోచి పెట్టారని ఆయన ఆరోపించారు. సమస్యలను పట్టించుకునేవారే లేరని ఆయన అన్నారు.