తెలంగాణకు సీమాంధ్ర కాంగ్రెసు ఎమ్మెల్యేల ప్రతివ్యూహం

17వ తారీఖున ప్రారంభమైన శాసనసభ సమావేశాలు ఇప్పటి వరకు సజావుగా సాగలేదు. ఆర్థిక శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా తన బడ్జెట్ను విపక్ష సభ్యులను సభనుండి బహిష్కరించిన అనంతరమే ప్రవేశ పెట్టారు. ఇక శాసనసభ ప్రారంభం అయిన రోజు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. ఇద్దరు టిడిపి, ముగ్గురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి గవర్నర్ నరసింహన్ స్పీచ్ను అడ్డుకోవడం, లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై టిఆర్ఎస్ దాడి తదితర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత అయినా సమావేశాలు సజావుగా సాగుతాయా అంటే తెలంగాణవాదులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీంతో ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అధికార సీమాంధ్ర ఎమ్మెల్యేలు సభను సజావుగా కొనసాగించడానికి తెలంగాణ ఎమ్మెల్యేలకు ధీటుగా ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని చెబుతూనే టిఆర్ఎస్, తెలంగాణ టిడిపి వారు శాసనసభలో గందరగోళం సృష్టించడాన్ని వారు ప్రశ్నించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఇదే విషయాన్ని విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని, రాష్ట్ర పరిధిలోని అంశం కాదని అన్నారు. కేంద్రం పరిధిలో ఉన్న అంశంపై తెలంగాణవాదులు గందగోళం సృష్టించటం సరికాదన్నారు. 17న ప్రారంభమైన సభలు ఇప్పటి వరకు సజావుగా సాగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభను సజావుగా సాగనివ్వని వారే మళ్లీ సభా సమయాన్ని వృధా చేశారని అనటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications