మారుతున్న టిడిపి స్వరం! ఒకే వాణి వినిపించిన ఎమ్మెల్యేలు
కాంగ్రెస్లో సీమాంధ్ర నేతలను, తెలంగాణ వారు, తెలంగాణ నేతలను, సీమాంధ్రులను దుమ్మెత్తి పోసిన సంఘటనలు ఉన్నాయి. కానీ టిడిపిలో మాత్రం అంత చెప్పుకోదగ్గవి ఇంతవరకు కనిపించలేదు. ఇప్పుడు కూడా వారు ఇరు ప్రాంతాల్లో పార్టీని రక్షించుకునే ఉద్దేశ్యంతోనే సమన్వయంగా ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు ఇటీవలే ఇరు ప్రాంతాల్లో పార్టీని రక్షించుకునే దృష్టితో ముందుకు వెళతామని స్పష్టమైన ప్రకటన చేశారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెట్టాలని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్, బిజెపి, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన పార్టీలకు సీమాంధ్ర ఎమ్మెల్యల నుండి మద్దతు రాకపోయినా, తెలంగాణ టిడిపికి మాత్రం సీమాంధ్ర ఎమ్మెల్యేల నుండి మద్దతు వచ్చింది.
సీమాంధ్రకు చెందిన యువ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఎమ్మెల్యేలు అంతరాత్మ ప్రభోదానుసారం ఓట్లు వేస్తారని చెప్పారు. శనివారం అసెంబ్లీలో టిడిపి మరో ముందడుగు వేసింది. టిడిపి మొత్తం ఒకే వాణిని వినిపించింది. తెలంగాణపై కేంద్రం సత్వరమే నిర్ణయం తీసుకొని రాష్ట్రంలోని అనిశ్చితిని తొలగించాలనే నినాదం ఉన్న ప్లకార్డులను ఆ పార్టీకి చెందిన అందరూ ఎమ్మెల్యేలు ప్రదర్శించి తామంతా ఒకే త్రాటిపై ఉన్నట్లు స్పష్టం చేశారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర అని, తెలంగాణ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్లకార్డులు ప్రదర్శించకుండా విభజన అంశంపై టిడిపి ఎమ్మెల్యేలు అంతా కలిసి ఒకే అభిప్రాయం వ్యక్తం చేయడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.
కేంద్రం తీసుకునే నిర్ణయానికి ఇరు ప్రాంతాల వారు కట్టుబడతారా లేదా అనే విషయం తర్వాత. కానీ మొదటిసారి వారు ఏకాభిప్రాయంతో ప్లకార్డులు ప్రదర్శించడం విశేషం. కాంగ్రెస్, టిఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలను గట్టిగా ఎదుర్కొనడానికే వారు ఇలా ప్లకార్డులు ప్రదర్శించారనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించి, సాధారణ పరిస్థితికి తీసుకొచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కూడా అసెంబ్లీలో టిడిపి డిమాండ్ చేసింది.