మమ్మల్ని పంపిస్తే ప్రత్యేక రాష్ట్రం వస్తుందా: కావూరి
ఒక్క తెలంగాణ పార్లమెంటు సభ్యుడిని రాజీనామా చేయమనండి అని ఆయన సవాల్ చేశారు. ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా అని ఆయన అడిగారు. దొడ్డిదోవన బతకవద్దని ఆయన తెలంగాణవాదులకు సలహా ఇచ్చారు. నలుగురు డబ్బున్నవాళ్ల పేర్లు చెప్పి మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తాను తెలంగాణలో ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని ఆయన చెప్పారు. బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
తాను రాత్రింబవళ్లు కష్టపడి దేశవిదేశాల్లో సంపాదించి ఇక్కడ పెట్టానని ఆయన చెప్పారు. నాయకులు సురక్షితంగా ఉండి సామాన్యులను మోసం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మీరు త్యాగాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నిలదీసి సాధించండని ఆయన సలహా ఇచ్చారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని, వారిని తాము వ్యతిరేకించడం లేదని ఆయన అన్నారు. తమ ప్రాంతాల ప్రజల అభిప్రాయాన్ని తాము ప్రతిబింబిస్తున్నామని ఆయన చెప్పారు.
తమకు మాట్లాడే హక్కు లేదా అని ఆయన అడిగారు. తెలంగాణ ఎంపీలపై ఒత్తిడి తేకుండా తమ మీద పడడం ఎందుకని ఆయన అడిగారు. తెలంగాణ నేతల్లోనూ భేదాభిప్రాయాలున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో రాజెవరైనా ఉన్నారా, ఎవరి అనుమతి తీసుకుని మాట్లాడాలని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. తన ఇంటిని ముట్టడించడానికి తాను చేసిన తప్పేమిటని ఆయన అడిగారు. నిజాం నవాబు వారసులు తలలు తీసేస్తామంటే ఎలా ఉంటుందని ఆయన అడిగారు. తాను ఏ నేరమూ చేయలేదని ఆయన అన్నారు.
తెలంగాణపై తమకు అన్ని వేళల్లో అభ్యంతరాలున్నాయని ఆయన చెప్పారు. సీనియర్ నాయకుడిగా తాను పార్లమెంటులో మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు. తెలంగాణ నేతలు గంటసేపు కూడా పదవులు లేకుండా ఉండలేరని ఆయన అన్నారు. పెట్టుబడిదారులు ఇక్కడ ఎవరి జేబులైనా కొడుతున్నారా అని ఆయన అడిగారు. బాగో, జాగోల వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తుందా అని ఆయన అడిగారు. కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. అయితే ఒకే రాష్ట్రానికి కట్టుబడి ఉంటామని మాట మార్చారు.