కావూరి నివాసంలో సీమాంధ్ర సమావేశాన్ని అడ్డుకుంటాం: ఒయు జెఎసి

సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల 'సమైక్యవాద కార్యాచరణ' భేటీని అడ్డుకుంటామని టీఆర్ఎస్, ఓయూ జేఏసీ నేతలు హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకమైన ఈ సమావేశాన్ని జరగనివ్వబోమని స్పష్టం చేశారు. ఈనెల 5న హైదరాబాద్లో ఎంపీ కావూరి సాంబశివరావు నివాసంలో భేటీ అవుతున్నామన్న ప్రకటనపై మండిపడ్డారు. "మా రక్తం మరిగిపోతోంది. ఇదివరకే నోటికాడి బుక్క లాక్కున్నారు. మళ్లీ ఇప్పుడు పార్టీలకతీతంగా ఒక్కటై తెలంగాణను అడ్డుకోవటానికి కుట్ర చేస్తున్నారు. వారికి ఇక్కడ ఉన్న భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అక్రమాస్తులను కాపాడుకోవటానికే ఇదంతా చేస్తున్నారు. అందుకే కావూరి ఇంట్లో భేటీని జరగనివ్వం'' అని టీఆర్ఎస్ నేతలు డి.శ్రవణ్ కుమార్ మీడియా ప్రతినిధులతో అన్నారు.
"పసలేని సమైక్యవాదంతో అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు సృష్టించవద్దు. రాష్ట్ర విభజనకు సహకరించాలి'' అని హితవు పలికారు. తెలంగాణపై కేంద్ర హోం మంత్రి చిదంబరం తాజాగా చేసిన వ్యాఖ్యలపై శ్రవణ్ మండిపడ్డారు. ఈనెల 10న 'మిలియన్ మార్చ్'తో తెలంగాణ ప్రజల తడాఖాను కేంద్రానికి చూపిస్తామని చెప్పారు. రైలు రోకో ద్వారా ప్రజలు కేంద్రం గూబ గుయ్మనేలా బలమైన సంకేతం పంపించారని, ఇందుకు సహకరించిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు చెప్పారు.












Click it and Unblock the Notifications