కెసిఆర్, కోదండరామ్ మధ్య విభేదాలు, మిలియన్ మార్చ్ కారణం?
అయితే, ఇరువురి మధ్య మిలియన్ మార్చ్ తేదీ ప్రకటనే విభేదాలకు దారి తీసినట్లు చెబుతున్నారు. మార్చి రెండో వారంలో చలో హైదరాబాద్ ఉంటుందని కోదండరామ్ ఫిబ్రవరి 24వ తేదీన ప్రకటించారు. అయితే, మార్చి పదవ తేదీన మిలియన్ మార్చ్ టు హైదరాబాద్ ఉంటుందని ఫిబ్రవరి 26వ తేదీన ఇంటర్మీడియట్ బోర్టు కార్యాలయం వద్ద జరిగిన జూనియర్ లెక్చరర్ల కార్యక్రమంలో కెసిఆర్ ప్రకటించారు. విద్యార్థుల పరీక్షలకు ఆటంకం కలిగించే ఉద్దేశం తమకు లేదని అదే సమావేశంలో కోదండరామ్ అంతకు ముందు ప్రకటించారు. కెసిఆర్ ఏకపక్ష ప్రకటనకు బిజెపి నిరసన వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. కెసిఆర్ ఏకపక్ష ప్రకటనకు కోదండరామ్ కూడా ఆశ్చర్యపోయినట్లు చెబుతున్నారు.
ఇప్పుడు మిలియన్ మార్చ్ టు హైదరాబాద్ వివాదంలో చిక్కుకుంది. పరీక్షలకు ఆటంకం కలిగించవద్దని, కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నట్లు కెసిఆర్తో పాటు కోదండరామ్ కూడా చెబుతున్నారు. అయితే, అప్పటికే మిలియన్ మార్చ్ టు హైదరాబాద్ కార్యక్రమానికి జెఎసి ఏర్పాట్లు చేసుకుంది. ప్రభుత్వ కుట్రలో భాగంగానే మార్చ్ను వాయిదా వేయించే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలంగాణవాదుల నుంచి వినిపిస్తోంది. పదవ తేదీ పరీక్షను వాయిదా వేసుకుంటే సరిపోతుందని, కానీ కార్యక్రమాన్ని వాయిదా వేయించే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ వర్గాల నుంచి తమపై ఒత్తిడి తెస్తోందని వారంటున్నారు. ఈ స్థితిలో మిలియన్ మార్చ్ను వాయిదా వేసుకోవాలా, వద్దా అనే విషయంపై చర్చ జరుగుతోంది.