ఫలించని కిరణ్ కుమార్ దౌత్యం, అసెంబ్లీకి రాబోమన్న తెలంగాణ ఎమ్మెల్యేలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని శాసనసభ సమావేశాలను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు బహిష్కరించారు. వారి బాటలోనే తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కూడా నడుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు కూడా సభకు హాజరు కావడం లేదు. దీంతో తెలంగాణకు చెందిన మెజారిటీ సభ్యులు లేకుండా సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు సభకు హాజరయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి తెలంగాణ మంత్రులను కోరారు.
కాగా, తెలంగాణ అంశంపై ఈ నెల 12వ తేదీ లోగా తేల్చాలని తెలంగాణ ప్రాంత మంత్రులు కూడా అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈలోగా ఢిల్లీకి వెళ్లి ఏదో ఒకటి తేల్చుకోవాలని వారు భావిస్తున్నారు. దాంతో తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లి ఏదో ఒకటి తేల్చిన తర్వాతనే తాము సభకు హాజరయ్యేదీ లేనిదీ చెబుతామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు మంత్రులతో తేల్చి చెప్పారు.