వెనక్కి తగ్గిన జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలు, కాంగ్రెసుకే ఓటు
శాసనసభ్యుల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తన మిత్ర పక్షాల అభ్యర్థులతో కలిపి ఏడు స్థానాలకు పోటీ చేస్తోంది. తెలుగుదేశం నాలుగు స్థానాలకు పోటీ చేస్తోంది. 11 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్న తెరాస కూడా ఒక్క సీటుకు పోటీ చేస్తోంది. పది స్థానాలకు 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రేపు గురువారం జరగనుంది. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యుల వల్ల లాభపడవచ్చుననే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అదనంగా ఓ అభ్యర్థిని రంగంలోకి దించినట్లు, తెరాస తన అభ్యర్థిని పోటీకి పెట్టినట్లు భావిస్తున్నారు. ప్రస్తుత పరిణామం తెలుగుదేశం పార్టీకి, తెరాసకు తీవ్రమైన దెబ్బగానే పరిగణించాల్సి ఉంటుంది.
గత రెండు రోజులుగా కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులతో సమావేశమవుతున్నారు. మంగళవారం వైయస్ జగన్కు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి, శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. బుధవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులతో సమావేశమయ్యారు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారిని తమ వైపు తిప్పుకోవడానికే ఈ సమావేశాలు నిర్వహించినట్లు చెబుతున్నారు.