కెసిఆర్ ఆస్తులపై సిబిఐ ఎంక్వయిరీ, డబ్బులు దండుకుంటున్నారు: దేవినేని
కెసిఆర్ ఆస్తులపైన సిబిఐ ఎంక్వయిరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ తెలంగాణ ప్రజల సెంటిమెంటుతో ఆడుకుంటున్నారన్నారు. సెంటిమెంటును అడ్డుపెట్టుకొని వందల వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చేసిన తప్పులు కప్పి పుచ్చుకోవడానికే కెసిఆర్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. కెసిఆర్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. పిచ్చి పిచ్చి మాటలతో తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కెసిఆర్కు రాజకీయ బిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీయేనని గుర్తుంచుకోవాలన్నారు. కెసిఆర్ తన భాషను మార్చుకోవాలని అన్నారు.
రాజకీయ బిక్ష పెట్టిన టిడిపినే విమర్శించడం సరికాదన్నారు. ఎమ్మెల్యేగా, ప్రభుత్వంలో మంత్రిగా ఎదిగింది దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, టిడిపి వల్లనే అనే విషయాన్ని మరిచి పోవద్దన్నారు. కెసిఆర్ మాట్లాడే భాష సంస్కారం లేనిదిగా ఉంటుందన్నారు. ఆయన మత్తులో మాట్లాడుతున్నట్టుగా ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెసు పార్టీ అని అలాంటి కాంగ్రెసును ఏమీ అనకుండా టిడిపిని లక్ష్యంగా చేసుకోవడాన్ని వారు ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ కూడా స్పష్టంగా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలనే దానికే తొలి ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు.