టోక్యోలోని నీటిశుద్ధి ప్లాంటులోని నీటిలో రేడియోధార్మికత
మరోవైపు.. ఫుకుషిమా పరిసర ప్రాంతాల్లో ఆకుకూరలు, పాలల్లో కూడా అయోడిన్, మరో రేడియోధార్మిక పదార్థం సీసీయంల మోతాదు పరిమితిని దాటిపోయింది. క్యాబేజీ, బ్రకోలీ, కాలీఫ్లవర్ తదితర కూరగాయలను వాడకూడదని ప్రధాని నవాటోకాన్ ప్రజలను కోరారు. ఫుకుషిమా, ఇబరాకీ, గన్మా, తోచిగీ రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాలకు పండ్లు, పాలు, కూరగాయల ఎగుమతులపై అధికారులు నిషేధం విధించారు. రేడియోధార్మిక పదార్థాలు హెచ్చుస్థాయిలో ఉన్న కూరగాయలను వందగ్రాముల చొప్పున పది రోజులు తినడం వల్ల మనకు సోకే రేడియోధార్మికత.. ఒక ఏడాదిలో మనం సహజంగా స్వీకరించే రేడి యోధార్మికతలో సగం భాగమని వారు చెప్పారు. భూకంపం కారణంగా ఫుకుషిమా అణు విద్యుత్కేంద్రంలోని నాలుగు రియాక్టర్లలో హైడ్రోజన్ పేలుళ్లు సంభవించడం, వాటి కారణంగా రేడియోధార్మికత పదార్థాలు సుదూర ప్రాంతాలకు వ్యాపించడం తెలిసిందే. ఈ రియాక్టర్ల శీతలీకరణ పనులకు బుధవారం కూడా ఆటంకం కలిగింది.
మూడో నంబర్ రియాక్టర్ నుంచి భారీస్థాయిలో నల్లటి పొగ రావడంతో అక్కడి సిబ్బందిని ఖాళీ చేయిం చారు. తర్వాత పొగ పరిమాణం తగ్గిపోయింది. ఒకటి, మూడో నంబర్ రియాక్టర్ల కంటైనర్ల ఉపరితల ఉష్ణోగ్రత వాటి నిర్దేశిత స్థాయిని మిం చిపోయింది. అయితే కంటైనర్లు కరిగిపోయే అవకాశం లేదని సిబ్బంది తెలిపారు. ఒకటో నంబర్ రియాక్టర్ను చల్లబరిచేందుకు బుధవారం కూడా అందులో నీటిని నింపారు. భూకంపం, సునామీల్లో ఇంతవరకు 9 వేల మంది చనిపోయారని, 15 వేల మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ప్రకృతివిపత్తు కారణంగా దేశంలో 30వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తాజాగా అంచనా వేసింది. ఫుకుషిమా తదితర ప్రాంతాల్లో బుధవారం కూడా రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇదిలా ఉండగా, తమ దేశంలోని సునామీ బాధితులకు 25 వేల ఉన్ని దప్పట్లు పంపినందుకు జపాన్ ప్రధాని నవాటో కాన్ భారత ప్రధాని మన్మోహన్ సింగ్కు ఓ లేఖలో కృతజ్ఞతలు తెలిపారు.