మారిన కాంగ్రెసు వ్యూహం: వైయస్ జగన్పై వైయస్ వివేకా పోటీ?
కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్పై ఆయన బాబాయ్, వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని పోటీకి దించాలని, జగన్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్పై గౌరవంతోనే తాము వైయస్ విజయమ్మపై పోటీ పెట్టడం లేదని ప్రచారం చేసుకుని జగన్ను లోకసభ స్థానంలో దెబ్బ తీయాలని ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖను బట్టి ఈ వ్యూహం అర్థమవుతోంది. పులివెందులలో వైయస్ విజయమ్మపై అభ్యర్థిని పోటీకి దించకూడదని కోరుతూ ఆయన సోనియాకు లేఖ రాశారు. ఇలా తమ పార్టీ నాయకుల ద్వారా విజ్ఞప్తులు చేయించి వైయస్ విజయమ్మపై పోటీని విరమించుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కామన్ సింబల్ను కేటాయించడానికి ఎన్నికల కమిషన్ నిరాకరించింది.