కమలమ్మ తిరిగి రావడం వెనుక యువనేత: సిఎం కిరణ్తో జగన్ గేమ్?
అయితే తన వర్గ ఎమ్మెల్యేలపై వేటు పడకుండా ఉండటానికి జగన్ కూడా ప్రయత్నాలు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్లాన్లో భాగంగానే ఆయన తన వర్గం ఎమ్మెల్యేలను ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు కాంగ్రెసులోనే ఉన్నట్లు ప్రకటన చేయమని చెప్పినట్లుగా తెలుస్తోంది. వారు తన వెంట ఉంటున్నారంటే పార్టీ వేటు వేయడం ఖాయం. కాబట్టి ప్రస్తుతానికి షోకాజు నోటీసులు అందుకోకుండా ఉండటం, వేటు పడకుండా ఉండటం కోసం కాంగ్రెసు వెంటే ఉంటామనే సంకేతాలు పంపి గట్టెక్కాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కడప ఉప ఎన్నికలు అయిపోయాక మెజార్టీ తగ్గినా పెరిగినా ఎలాగూ తాను తన తల్లి గెలుస్తుంది. ఆ తర్వాత తన వద్దకు చాలా మంది వస్తారు కాబట్టి ఆ తర్వాత చర్యలు తీసుకున్నా ఫరవాలేదనే భావనలో జగన్ వర్గం ఉన్నట్టుగా తెలుస్తోంది.
అందులో భాగంగానే బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మ మొదటగా జగన్ను వీడి కాంగ్రెసు వైపు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే కమలమ్మ విషయంలో జగన్నాటం ఉన్నా లేకున్నా శ్రీనివాసులు తదితర ఎమ్మెల్యేలు కాంగ్రెసులో చేరతామని చెప్పడం వెనుక మాత్రం జగన్ హస్తం ఉన్నట్లుగా పలువురు కాంగ్రెసు నేతలు భావిస్తున్నారు. జగన్ ఎమ్మెల్యేల విషయాన్ని పలువురు కాంగ్రెసు నేతలు కూడా ముందుగానే గమనించినట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఎమ్మెల్యే శ్రీనివాసులు వంటి వారు తిరిగి కాంగ్రెసులోకి వస్తామని చెప్పడంపై విశ్వాసం లేనట్లుగా తెలుస్తోంది.