కోయంబత్తూరు బాలిక హత్య కేసుపై నవ్విన టీవీకే మంత్రి కీర్తన.. భగ్గుమన్న బీజేపీ!
తమిళనాడులోని కోయంబత్తూరులో పదేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి, హత్యోదంతం తమిళనాట రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ దారుణ ఘటనపై అధికార డీఎంకే పారిశ్రామిక శాఖ మంత్రి కీర్తన విచిత్రంగా స్పందించారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతుండగా ఆమె నవ్వడం ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహానికి కారణమైంది. నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండగా, మంత్రి ప్రవర్తన నిర్లక్ష్యానికి నిదర్శనమని బీజేపీ ఆరోపించింది.
మంత్రి తీరుపై భగ్గుమన్న బీజేపీ నేత
ఒక అధికారిక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కీర్తన బాలిక హత్య గురించి ప్రశ్నించగా, కీర్తన పరిపాలనాపరమైన ప్రశ్నలకే సమాధానం ఇస్తానని చెబుతూ నవ్వారు. దీనిపై బీజేపీ సీనియర్ నేత వినోజ్ పి. సెల్వం డీఎంకే ప్రభుత్వంపై మండిపడ్డారు: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ ఘటనే చెబుతోందన్నారు.

తన హావభావాలను వక్రీకరిస్తున్నారన్న మంత్రి
పదేళ్ల చిన్నారి దారుణంగా హత్యకు గురైతే.. ఒక మహిళా మంత్రి అయి ఉండి కూడా ఆ ప్రశ్నకు నవ్వుతూ సమాధానం దాటవేయడం అత్యంత సిగ్గుచేటు. ఆమె ఈ ఘోరాన్ని చాలా తేలికగా తీసుకున్నారు” అని ఆయన ఆరోపించారు. మంత్రి సోషల్ మీడియా వివరణను కూడా సెల్వం తప్పుబట్టారు. తనపై వస్తున్న విమర్శలను మంత్రి కీర్తన తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తన హావభావాలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
విపక్షాలు వ్యక్తిగత దాడులు చేయటం మంచిది కాదు
మీడియా సమావేశం తర్వాత సహజంగా నవ్వానని.. బాలిక హత్య గురించిన ప్రశ్నకు నవ్వలేదని మంత్రి స్పష్టం చేశారు. “ఇది చాలా హేయమైన నేరం. ఈ ఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది” అని ఆమె పేర్కొన్నారు. విపక్షాలు వ్యక్తిగత దాడులు చేయటం, హద్దులు దాటి ట్రోలింగ్ చేయడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య లక్షణం కాదని ఆమె హితవు పలికారు.
బాలిక హత్య కేసులో ప్రభుత్వం తీసుకున్న చర్యలను చెప్పిన మంత్రి
ఈ కేసులో ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలను మంత్రి వివరించారు. మే 21న సులూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక కనిపించకుండా పోవడం, ఆపై హత్య కేసులో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, 250కి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి 24 గంటల్లోనే ప్రధాన నిందితుడు కె. కార్తీతో పాటు మరో నిందితుడు మోహన్రాజ్ను అరెస్ట్ చేశారన్నారు. వీరిద్దరిపై పోక్సో చట్టం కింద కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేశామని, మహిళలు, పిల్లల రక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని కీర్తన స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications