తెలుగుదేశం పార్టీలోకి హీరో రాజశేఖర్, జీవిత దంపతులు?
వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వారిద్దరు ఆయన కుమారుడు వైయస్ జగన్కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. వారిని జగన్ కాదనలేదు గానీ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. తమకు తగిన ప్రాధాన్యం లభిస్తుందనే ఆశతో వారు ఇంత వరకు జగన్ వెంట ఉన్నప్పటికీ చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో వారు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ అసంతృప్తి కారణంగానే వారు తమ మార్గాన్ని మార్చుకున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తుండడంతో రాజశేఖర్ దంపతులు కాంగ్రెసులోకి వెళ్లే అవకాశాలు లేవు. చిరంజీవిని వారు తమ ప్రధాన శత్రువుగానే పరిగణిస్తున్నారు. పైగా, చిరంజీవికి కాంగ్రెసులో అత్యధిక ప్రాధాన్యం లభిస్తోంది. కాంగ్రెసులోకి వెళ్తే చిరంజీవికి లభించే ప్రాధాన్యం తమకు లభించదనే విషయం వారికి తెలుసు. అందుకే, వారు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
నిజానికి, రాజశేఖర్ స్వర్గీయ ఎన్టీ రామారావుకు అత్యంత సన్నిహితుడు. దాంతో రాజశేఖర్ దంపతులు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆకర్ష్ పథకంలో భాగంగా వారు కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు. చిరంజీవిపైనే కాకుండా వైయస్ జగన్పై కూడా రాజశేఖర్ దంపతులు శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్వన్నీ అక్రమాస్తులేనని వారు దుయ్యబట్టారు. జగన్కు కావాల్సింది అధికారమేనని అన్నారు. దీన్ని బట్టి కడప ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడే ఉద్దేశంతో వారిద్దరు జగన్కు, చిరంజీవికి వ్యతిరేకంగా ఈ సందర్భంలో మీడియా ముందుకు వచ్చినట్లు భావిస్తున్నారు.