చంద్రబాబుకు సవాల్, వెనక్కి తగ్గని టిడిపి నేత నాగం జనార్దన్ రెడ్డి
సమావేశంలో పార్టీ జెండా లొల్లే తప్ప తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు ఎలా తీసుకుని వెళ్లాలనే ఆలోచన చేయలేదని, అటువంటి సమావేశంలో తాను ఎలా కూర్చుంటానని ఆయన అన్నారు. సమావేశం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగింది కాబట్టి చాలా మంది మాట్లాడడానికి భయపడుతున్నారని ఆయన అన్నారు. తాను నిర్వహించిన నాగర్ కర్నూలు సభ ప్రకంపనలు సృష్టించిందని, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే సమావేశం నిర్వహించానని ఆయన అన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రజల సమీకరణకు పార్టీ జెండా పెడితే ఎలా వస్తారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం చేపట్టే ఉద్యమంలో పార్టీ జెండా పెడితే అన్ని పార్టీలవాళ్లు రారని ఆయన అన్నారు.
కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు కూడా పార్టీ జెండా పెట్టడం లేదని, ఎర్రబెల్లి దయాకర రావు వరంగల్ జిల్లాలో ఎలా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ సాధించుకోగలుగుతామని ఆయన చెప్పారు. కాలం చెల్లిన ప్రణబ్ కమిటీకి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామంటే ఎవరు నమ్ముతారని ఆయన అడిగారు. తాము కలిసినప్పుడు చంద్రబాబు నుంచి తెలంగాణకు అనుకూలంగా లేఖ కావాలని కేంద్ర హోం మంత్రి చిదంబరం సంకేతాలిచ్చారని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ నాయకులు స్పష్టత లేదని ఆయన అన్నారు.