తెలంగాణా బరాబర్ మా అయ్య జాగీరే: పవన్ కళ్యాణ్ కు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్!
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. తన సభలను అడ్డుకుంటున్నారని మండిపడుతూ, "తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రాంతం బరాబర్ మా అయ్య జాగీరే: మంత్రి పొన్నం
ఈ వ్యాఖ్యలపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పవన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
"మిస్టర్ పవన్ కల్యాణ్.. ఈ తెలంగాణ ప్రాంతం బరాబర్ మా అయ్య, మా తాత ముత్తాతల జాగీరే" అంటూ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ తన అహంకారాన్ని మరోసారి ప్రదర్శించారని మండిపడ్డారు.

బీజేపీ స్క్రిప్ట్ చదువుతున్నాడు
తనకు ఆంధ్రప్రదేశ్లోనే సరైన దిక్కులేదని స్వయంగా ఒప్పుకున్న పవన్కు, తెలంగాణలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు విడిపోయినా ప్రజలు అన్నదమ్ములుగా కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నామని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ లేదా బీఆర్ఎస్ రాసిచ్చిన స్క్రిప్ట్ను పవన్ కల్యాణ్ చదువుతున్నారని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.
పవన్ను బీజేపీ స్క్రీన్ టెస్ట్ చేస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్
సినిమాల్లో నటీనటులకు స్క్రీన్ టెస్ట్ చేసినట్లు, తెలంగాణ రాజకీయాల్లో పవన్ను బీజేపీ స్క్రీన్ టెస్ట్ చేస్తుందని, ఒక సాధనంగా వాడుకుంటోందని ఆరోపించారు. పవన్ కల్యాణ్ తెలంగాణకు రాకపోకలు సాగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే గొడవలు సృష్టించేలా 'నవ నిర్మాణ సంకల్ప సభ' పేరిట రాజకీయాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
తెలంగాణా ఉద్యమంలో పవన్ పాత్ర ఏంటి?
గతంలో తెలంగాణ ఉద్యమ సమయాల్లో కానీ, అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవడంలో కానీ పవన్ పాత్ర ఏముందో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావద్దని కోరుకున్నవారు తెలంగాణా కోసం ఏం చేస్తారో చెప్పాలని పొన్నం ప్రభాకర్ నిలదీశారు.












Click it and Unblock the Notifications