చంద్రబాబుది రహస్య ఎజెండా, ఆయనది సీమాంధ్ర కన్నే: నాగం
చంద్రబాబు కబంధ హస్తాల నుంచి కొంత మంది బయటపడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంపై పోలిట్బ్యూరో సభ్యులకే అనుమానాలున్నాయని ఆయన అన్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని ఎర్రబెల్లి దయాకర రావు చంద్రబాబు కాళ్లు మొక్కారని ఆయన అన్నారు. శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఉందని, ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే పదవి ప్రజలు ఇచ్చారని, చంద్రబాబు ఇవ్వలేదని ఆయన అన్నారు.
తెలంగాణలో తెలుగుదేశం క్యాడర్ పోతోందని ఆయన అన్నారు. పార్టీని కాపాడడానికే తాను ప్రయత్నించానని ఆయన చెప్పారు. తాను అవినీతికి లొంగిపోలేదని, ఓబుళాపురం గనుల లీజుపై చాలా మంది రాజీపడితే తాను తిరుగులేని పోరాటం చేశానని ఆయన అన్నారు. కొందరు తెలుగుదేశం సభ్యులు తనను సంప్రదిస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ పెట్టే విషయంపై ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. తెలంగాణపై తమ వైఖరి ఇది అని కచ్చితంగా చెప్పారా అని తెలుగుదేశం తెలంగాణ నాయకులను అడిగారు.
తెలంగాణపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారనే చంద్రబాబు విమర్సను ఆయన వ్యతిరేకించారు. అఖిల పక్ష సమావేశంలో నిర్ణయం ప్రకటించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ప్రకటన చేసిందని ఆయన చెప్పారు. చంద్రబాబు వాదనలో పస లేదని, నమ్మేట్లు లేదని ఆయన అన్నారు. చంద్రబాబు వైఖరి వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఇప్పుడు ఒక్కటే కన్ను ఉందని, అది సీమాంధ్ర కన్ను మాత్రమేనని ఆయన అన్నారు.