చంద్రబాబుకు మహానాడు సవాళ్లు, తెలంగాణపై ఏం చెబుతారు?
తెలంగాణపై ధిక్కార స్వరం వినిపించిన నాగం జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో సమస్య పరిష్కారమైందని అనుకోవడానికి లేదు. జోగు రామన్న, హరీశ్వర్ రెడ్డి వంటి శాసనసభ్యులు తిరుగుబాటు స్వరాలు వినిపిస్తూనే ఉన్నారు. అటువంటి వారు ఇంకెంత మంది ఉన్నారో కూడా తెలియడం లేదు. ఇప్పటికే రాజీనామా చేసి పోచారం శ్రీనివాస రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. ఈ స్థితిలో మహానాడులో తప్పనిసరిగా తెలంగాణపై మాట్లాడాల్సిన అనివార్యతలో చంద్రబాబు పడ్డారు.
తెలంగాణపై మహానాడులో చంద్రబాబు మాట్లాడుతారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. అందువల్ల 'తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం ఎటూ తేల్చకుండా రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చింది. ఈ అనిశ్చితితో రాష్ట్రం సర్వనాశనమవుతోంది. ఎంత కాలం ఇలా? ఏదో ఒకటి తేల్చండి. తేల్చలేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పుకోండి' అని చంద్రబాబు మాట్లాడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
కాగా, నందమూరి, నారా కుటుంబాల మధ్య వారసత్వ పోరు కూడా చంద్రబాబుకు సమస్యగానే మారింది. ఇదే సమయంలో చంద్రగిరి పార్టీ ఇంచార్జీగా నారా లోకేష్ను నియమించాలని ఆ నియోజకవర్గం నాయకులు కోరుతుండడం చంద్రబాబుకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. దీనిపై చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గం నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనికి చంద్రబాబు ఏ విధమైన పరిష్కారం చూపుతారనేది వేచి చూడాల్సిన విషయమే.
ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చంద్రబాబుకు సవాల్ మీద సవాల్ విసురుతున్నాడు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి శానససభ్యులు జగన్ వైపు వెళ్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు ఎంత మంది అటు వెళ్తారనేది ఇంకా స్పష్టంగా తెలియదు. పైగా, కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని జగన్ పదే పదే విమర్శిస్తున్నారు. దీన్ని తిప్పికొట్టడం కూడా చంద్రబాబుకు సమస్యగానే ఉంది. ఏమైనా, ఈ మహానాడు చంద్రబాబుకు అత్యంత కీలకమైందనే చెప్పాలి.