చంద్రబాబు కొత్తగా ఏమైనా చెప్పారా, పాత వైఖరినే వల్లించారా?

కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే విషయంపై కూడా ఆయన కొత్తగా చెప్పిందేమీ లేదు. కాకపోతే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు చంద్రబాబు విసిరిన సవాల్ కాస్తా సంచనలంగా కనిపించింది. తనకు మద్దతు ఇస్తున్న శానససభ్యుల జాబితాను గవర్నర్కు సమర్పించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వైయస్ జగన్ ముందుకు వస్తే తాము సహకరిస్తామని ఆయన చెప్పారు. ఇది అయ్యే పని కాదని చంద్రబాబుకు తెలుసు. అందువల్ల అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే ఉద్దేశం చంద్రబాబుకు ఇప్పుడైతే లేదని స్పష్టంగానే తెలిసిపోతోంది.
తెలంగాణ అంశంపై కొత్తగా ఆయన చెప్పిందేమీ లేదు. రెండు ప్రాంతాల్లో తాను పార్టీని కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నానని, అది తన తప్పు కాదని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీకి ఒక వైఖరి ఉండాలనే మాటకు ఆయన ఇచ్చిన సమాధానం అది. తాము ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖకు గానీ, అఖిల పక్ష సమావేశంలో వెలిబుచ్చిన వైఖరికి గానీ కట్టుబడి ఉంటామని ఆయన చెప్పలేదు. పైగా, తెలంగాణపై తమ వైఖరి స్పష్టంగా ఉందని ఆయన చెప్పుకున్నారు. రెండు ప్రాంతాలు తనకు సమానమంటూ పార్టీ పరంగా తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న వైఖరిని అటకెక్కించారు. పైగా, దాని నుంచి తాము వెనక్కి తగ్గుతున్నామని అయినా చెప్పలేకపోతున్నారు. ఈ రెండు కళ్ల సిద్ధాంతం వల్ల తెలంగాణకు ఒరిగేదేమీ లేదు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న కాంగ్రెసుదేనని చెప్పి తన బాధ్యత నుంచి ఆయన తప్పుకున్నారు. మొత్తం మీద, గంటల కొద్దీ చేసిన ప్రసంగంలో చంద్రబాబు చెప్పిన కొత్త విషయాలేమీ లేవు.












Click it and Unblock the Notifications